Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
దాసరి ట్రెండ్ సెట్టర్: మధ్యతరగతికి దాసరి చెంపపెట్టు, బాలచందర్ లాగే...
తెలుగు సినీ రంగంలో దాసరి నారాయణ రావు ఓ ట్రెండ్ సెట్టర్. ఆయన తీసిన ప్రయోజనాత్మక చిత్రాలు ఆ విషయాన్ని పట్టిస్తాయి. మధ్యతరగతి విలువలపై ఆయన సినిమాలు చెంపపెట్టులాంటివి.
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు తెలుగు సినీరంగంలో ఓ ట్రెండ్ సెట్టర్. మధ్యతరగతి విలువలను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. తమిళంలో బాలచందర్ లాగే తెలుగులో దాసరి నారాయణ రావు మధ్యతరగతి విలువలపై కొరడా ఝళిపించారు.
తాను పశ్చిమ బెంగాల్లో పుట్టి ఉంటే ఎక్కువ గౌరవం దక్కి ఉండేదని కూడా ఆయన బాధపడిన రోజులున్నాయి. ఆయన తెలుగు సినీ రంగానికి అందించిన ఆణిముత్యాలున్నాయి. పాపులర్ సినిమాలూ ఉన్నాయి. రెండింటినీ ఆయన సమర్థంగా నిర్వహించారు.
నిజానికి, సినిమా అనేది దృశ్య మాధ్యమం. అయితే, దాన్ని వెర్బల్ మీడియాగా మార్చేశారు. ఇది నిజానికి అంత అంగీకార యోగ్యం కాదు గానీ ఆ సినిమాలు విశేషమైన జనాదరణ పొందాయి. సంభాషణలకు ఆయన విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికీ దర్శకులు హీరోలతో అటువంటి డైలాగులు చెప్పించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారంటే అది దాసరి నారాయణ రావు తెచ్చిన ట్రెండ్ అని చెప్పక తప్పదు.
తాతమనవడు సినిమా....
తన తొలి సినిమాతోనే దాసరి నారాయణ రావు తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. మధ్యతరగతి విలువలపై ఈ సినిమా ద్వారా ఆయన కొరడా ఝళిపించారు. అనుబంధాలకు, ఆత్మీయతలకు జీవితంలో ఉండాల్సిన ప్రాధాన్యాన్ని చెప్పారు. హాస్యనటుడు రాజబాబుతో సీరియస్ పాత్రను వేయించి, సెభాష్ అనిపించుకున్నారు. ఇటువంటి సినిమా తీయడం ఆయనకే చెల్లింది.
తూర్పు పడమర....
తెలుగులో తూర్పు పడమర ఓ ప్రయోగాత్మ చిత్రమనే చెప్పాలి. బాలచందర్ తమిళంలో అపూర్వ రాగంగళ్ పేర ఈ సినిమాను నిర్మించారు. దాన్ని దాసరి నారాయణ రావు తన దర్శకత్వంలో తెలుగు తెరకు ఎక్కించారు. ఈ సినిమాలో సత్యనారాయణ, నరసింహరాజు, మురళీమోహన్, శ్రీవిద్య, మాధవి నటించారు.
స్వర్గం నరకం....
దాసరి నారాయణ రావు ఆలోచనసరళిని ప్రతిబింబించే సినిమాల్లో ఇది కూడా ఒక్కటి. తెలుగు సినిమాను ఫ్యూడల్ భవబంధాల నుంచి విముక్తి కలిగించి మధ్యతరగతి బాట పట్టించిన ఘనత కూడా దాసరి నారాయణ రావుకు దక్కుతుంది. అలాంటి సినిమాల్లో స్వర్గం నరకం ఒక్కటి. ఈ సినిమా ద్వారానే మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేశారు. స్వర్గం నరకం అనేవి మనసు సృష్టించినవేనని తేల్చిన సినిమా అది. మథ్యతరగతి విలువలపై ఈ సినిమా ఓ పెద్ద దెబ్బ.
నీడ ఓ ప్రయోగాత్మక చిత్రం...
దాసరి నారాయణ రావు నీడ ఓ ప్రయోగాత్మక చిత్రమనే చెప్పాలి. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే వాళ్లను చూసి పిల్లలు అలా ప్రవర్తిస్తారని చెప్పే సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఈ చిత్రంలో నటించారు. తండ్రిస్త్రీ వ్యామోహాన్ని గమనించిన కుమారుడు తాను కూడా అదే బాటలో నడిచి పతనమవుతాడు. బ్లాక్ అండ్ వైట్లో అత్యద్భుతంగా వచ్చిన చిత్రం ఇది.
బలిపీఠం సినిమా...
బలిపీఠం సినిమా ఓ క్లాసిక్లా ఉంటుంది. రంగనాయకమ్మ రాసిన నవలను ఆయన తెరకెక్కించారు. నిజానికి ఈ నవలను తెరకెక్కించడం సాహసమే. కులాలకు దూరంగా ఉంటున్న సినిమాను కుల అస్తిత్వాన్ని పరిచయం చేశారు. బ్రాహ్మణ స్త్రీ, దళిత పురుషుడు వివాహం చేసుకుంటే ఎదురయ్యే సాంస్కృతిక వైరుధ్యాలను ఈ సినిమాలో చూపించారు. నష్టం ఏ వైపు జరుగుతుందనేది కూడా స్పష్టంగానే సినిమాలో ఉంది.
ఓ మనిషీ తిరిగి చూడు..
మానవ విలుపలను తెలియజేసే చిత్రం. ఇది కూడా మధ్యతరగతి ఇతివృత్తాన్ని ఎంచుకుని తీసిన సినిమా. ఈ చిత్రంలో మోహన్ బాబు, మురళీమోహన్, నిర్మల, కె. విజయ నటించారు.
కటకటాల రుద్రయ్య
కృష్ణం రాజు హీరోగా వచ్చిన చిత్రం ఇది. ఈ చిత్రంతోనే బహుశా యాంటీ హీరో ప్రాధాన్యంతెలుగు సినిమాలకు ప్రధాన భూమిక మారి ఉంటుంది. కృష్ణంరాజు చేత అత్యంత బలమైన సంభాషణలు పలికించిన చిత్రం ఇది. కృష్ణంరాజుకు ఇందులో చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. దానివల్ల కృష్ణంరాజు పాత్ర అత్యంత అద్భుతంగా ఎలివేట్ అయింది.
వెర్బల్ మీడియాగా...
తొలుత ప్రత్యామ్నాయ, వ్యాపారాత్మక సినిమాలకు మధ్యన ప్రయోజనాత్మక సినిమాలను రూపొందిస్తూ వచ్చిన దాసరి నారాయణ రావు వ్యాపారాత్మక సినిమాల వైపు కూడా దృష్టి మళ్లించారు. మధ్య మధ్యలో ప్రయోజనాత్మకమైన చిన్న సినిమాలను తెరకెక్కిస్తూనే మాస్ సినిమాలకు ప్రాణం పోశారు. బెబ్బులి పులి, తాండ్ర పాపారాయుడు వంటి సినిమాల్లో సంభాషణలు అదిరిపోతాయి. వీటిలో దృశ్య ప్రాధాన్యం తగ్గి మాటల ప్రాధాన్యం పెరిగింది. దాంతో ఎన్టీ రామారావు వంటి మాస్ హీరోకు తిరిగి సినీరంగంలో అద్భుతమైన విజయాన్ని అందించిన ఘనత దాసరి నారాయణ రావుకు దక్కుతుంది.