Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏ హీరో అభిమానులని కూడా చూడం.., బాలయ్య చిరు అభిమానులకి డీజీపీ వార్నింగ్
అభిమానులెవరైనా హద్దులు దాటితే కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని బాలయ్య చిరు అభిమానులకి డీజీపీ వార్నింగ్ ఇచ్చారు
హీరోలు ఇద్దరూ ఆల్ ద బెస్ట్లు చెప్పుకొంటున్నా.. మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రం నువ్వా..నేనా అన్నట్టు రెండు సినిమాల విడుదల కోసం సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కయ్యానికి కాలు దువ్వినా, ఎలాంటి చిన్న ఘటన జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. రెండు సినిమాల విడుదల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలను చేపట్టింది. సున్నితమైన అంశాలను జాగ్రత్తగా డీల్ చేయాల్సిందిగా పోలీసు సిబ్బంది, సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఏపీ డీజీపీ సాంబశివ రావు ఆదేశాలు జారీ చేశారు.
'మీరు చిరంజీవిని అభిమానిస్తారో.. బాలకృష్ణను అభిమానిస్తారో మీ ఇష్టం. అందుకు మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎదుటి వారి పోస్టర్లు చించినా, సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు పెట్టినా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం' అని డీజీపీ సాంబశివరావు... సినీ హీరోల అభిమానులను హెచ్చరించారు. అభిమానం తప్పు కాదు, దురభిమానంతో హద్దు మీరితే అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమా విడుదల కానుండటంతో వీరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
'సంక్రాంతి మాదే.. మా హీరో సినిమానే హిట్టవుతుంది' అంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ వ్యవహారంపై డీజీపీ శనివారం విజయవాడలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. థియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, రెండు సినిమాలు ఒకే కాంప్లెక్స్లో రిలీజవుతుంటే అక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను సైతం పర్యవేక్షిస్తామని ఆయన చెప్పారు. ఈ బాధ్యతను సైబర్ క్రైమ్ సిబ్బంది చూసుకుంటారని వెల్లడించారు. అభిమానులెవరైనా హద్దులు దాటితే కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని, అంతేగాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అభిమానులు వారివారి హద్దులు దాటకుండా ఇద్దరు హీరోల అభిమాన సంఘాలూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.