Don't Miss!
- News టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
క్రిష్ తాజా చిత్రం 'దాగుడుమూత దండాకోర్' కథేంటి?
హైదరాబాద్: దర్శకుడు క్రిష్ చిత్ర నిర్మాణంరంగంలోనూ అడుగేసి ఉషాకిరణ్ మూవీస్తో కలసి 'దాగుడుమూత దండాకోర్' చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, బేబీ సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. రామోజీరావు నిర్మాత. క్రిష్ సమర్పకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ గురించి ఆయన వివరించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
క్రిష్ మాట్లాడుతూ... 'దాగుడుమూత దండాకోర్' చాలా విచిత్రమైన కథ. తాత మనవరాళ్ల మధ్య నడిచే పల్లెటూరి నేపథ్యంలోని కథ ఇది. వీరి మధ్యలో కోడి కూడా ఉంది. సడన్గా ఓ రోజు కోడి మాయమైపోతుంది. ఆ కోడి కోసం వూరు వూరంతా గగ్గోలు పెడుతుంది. బాబాలొస్తారు, మంత్రగాళ్లొస్తారు, దొంగ స్వామీజీలొస్తారు, దొంగ కోళ్లుపట్టేవాళ్లొస్తారు... ఆ హంగామా మాటల్లో చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే కోడి కోసం ఆడిన దాగుడుమూతల ఆట ఇది. ఆ దాగుడుమూతల్లోంచి పుట్టుకొచ్చే వినోదం.. ఆ అనుబంధాల్లో ఉన్న ఆత్మీయత, పల్లెటూరి అమాయకత్వం, ఆ పచ్చదనం... అన్నీ కలిస్తే 'దాగుడు మూత దండాకోర్'. అన్నారు.
అలాగే తాతయ్య, మనవరాలు కలిస్తే ఆ సందడి వేరు. ఆ హంగామా అంతా ఈ సినిమాలో ఉంది. సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉంటాం. 'కాసేపు ఆపండ్రా బాబూ... నవ్వలేకపోతున్నాం' అనేస్థాయిలో వినోదాన్ని మేళవించారు. అంతేనా అంటే మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలూ ఉన్నాయి. అందుకే నవ్వుతూ, నవ్వుతూ.. ఏడుస్తాం.. ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతాం..! అదో అద్భుతమైన అనుభూతి అన్నారు.
కథ ఓకే అయిన విధానం గురించి చెప్తూ... ''దర్శకుడు ఎ.ఎల్.విజయ్, నేనూ మంచి స్నేహితులం. మాటల సందర్భంలో ఓ సారి ''క్రిష్.. నేనో చిన్న కథ రాశా'' అంటూ 'శైవం' కథను నాలుగు ముక్కల్లో చెప్పాడు. 'బాగానే ఉంది' అనిపించింది. కొన్ని రోజుల తరవాత 'శైవం' చూశా. నా అభిప్రాయం 'బాగానే ఉంది' నుంచి 'అద్భుతంగా ఉందే' అనేంతగా మారింది. సినిమా చూస్తున్నంతసేపూ పాత్రల మధ్య ప్రయాణం చేశా. ఆ కథలో లీనమైపోయా. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాలనిపించింది.
వెంటనే ఈటీవీ బాపినీడు గారిని కలిసి 'శైవం' డీవీడీ ఇచ్చా. ఆయనకూ నచ్చింది. ఆ తరవాత కిరణ్గారు చూశారు. వెంటనే ఈ ప్రాజెక్టు ఓకే అయిపోయింది. ఆర్.కె.మలినేనిని దర్శకుడిగా ఎంచుకొన్నాం. ధారావాహికలతో తన ప్రతిభను నిరూపించుకొన్న దర్శకుడాయన. ఆయనపై మా బృందానికి చాలా నమ్మకముంది. 'గమ్యం'కు పని చేసిన నా బృందాన్ని కలుపుకొన్నాం. అలా 'శైవం' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో కథ ఇంత త్వరగా 'ఓకే' అనిపించుకోవడం అరుదైన విషయం అని చెప్పుకొచ్చారు.
ఇక ఓ కథను రీమేక్ చేస్తున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. మాతృకలో ఉన్న ఆత్మను అలానే మరో భాషలో తర్జుమా చేయడం కష్టం. 'దాగుడుమూత దండాకోర్' ఆ పరిమితుల్ని దాటుకొచ్చింది. అతివిశ్వాసం అనుకోకపోతే ఒక్క మాట చెబుతా. 'తమిళంలో కంటే తెలుగులో బాగా తీశాం. 'మా సినిమా చూడు నీకంటే బాగా తీశాం' అని విజయ్తోనే చెప్పా. ఇంత నమ్మకం ఎందుకంటే ఈ సినిమా నేను చూశా. 'శైవం' చూసినప్పుడు ఏ అనుభూతికి గురయ్యానో అంతకంటే పది రెట్లు ఉద్వేగానికి లోనయ్యాను. నా తొలి సినిమా 'గమ్యం' నాకెంతో సంతృప్తి కలిగించింది. మంచి పేరు తెచ్చింది.
అయినా అందులో నాకు కొన్ని లోపాలు కనిపిస్తాయి. అలాంటివేం లేకుండా ఆర్.కె.మలినేని చక్కగా.. నాకంటే గొప్పగా తీశాడు. మరీ ముఖ్యంగా పతాక సన్నివేశాలు చూసి మాటలు రాలేదు. 'కొట్టేశాడ్రా' అనిపించేంత బాగా తీశాడు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలి అనేంత ఉత్సాహాన్నిచ్చింది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో ఓ సినిమా చేయడం, సమర్పకుడిగా తెరపై నా పేరు చూసుకోవడం గర్వంగా అనిపించింది. జనం మంచి సినిమాల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. అలాంటి నమ్మకంలోంచి 'గమ్యం','వేదం', 'కృష్ణం వందే జగద్గురుమ్'లాంటి సినిమాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు 'దాగుడుమూత దండాకోర్' వస్తోంది అన్నారు.