twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప‌ద్మ‌శ్రీ ఇవ్వ‌క‌పోవ‌డం దౌర్భాగ్యం: దాస‌రి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరోసారి తనదైన రీతిలో కామెంట్ చేసారు. సీనియర్ యాక్టర్స్ జమున, కైకాల సత్యనారాయణలను మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..... అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మ‌శ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్ర‌భుత్వాలు ప్ర‌తిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్ల‌నే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మ‌శ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

    దాస‌రి మ‌రిన్ని విశేషాలు ముచ్చ‌టిస్తూ -మ‌ద్రాసులో ఆర్టిస్టుల సంఘం మొద‌లైనా, హైద‌రాబాద్‌లో అది మా అసోసియేష‌న్‌గా అవ‌త‌రించింది. రామానాయుడు డ‌బ్బింగ్ స్టూడియో ప‌రిస‌రాల్లో ఓ చీకటి వేళ ఇది మొద‌లైంది. సీనియ‌ర్ న‌టులు ప్ర‌భాక‌ర్ రెడ్డి, గుమ్మ‌డి స‌మ‌క్షంలో మాకు అంకురార్ప‌ణ జ‌రిగింది. వైజాగ్ నుంచి విమానంలో వ‌స్తూ మా అనే పేరును ఫైన‌ల్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో సంఘాలు వ‌చ్చి వెళ్లాయి. అన్నిటిలో నేటి అసోసియేష‌న్ ప‌నితీరు బావుంది. కోటీశ్వ‌రులైన ఆర్టిస్టులు, పేద‌లైన ఆర్టిస్టులు మ‌న‌కు ఉన్నారు. పేద క‌ళాకారుల్లో కొంద‌రి అడ్రెస్‌లు కూడా తెలీని ప‌రిస్థితి. అలాంటివారిని గుర్తించి ఆదుకోవాల‌ని మా గత అధ్య‌క్షులు ముర‌ళీమోహ‌న్‌ని కోరాను. మాకు విడిగో 10 కోట్లు కేటాయించి సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని కోరాను. నిర్మాత‌ల‌మండ‌లికి 14 కోట్ల నిధి ఏర్పాటు చేసి అంద‌రికీ హెల్త్‌కార్డులు, ఇన్సూరెన్స్ వంటివి ఏర్పాటు చేశాం. అదే త‌ర‌హాలో న‌టీన‌టులంద‌రికీ చేయాల‌ని కోరాను. కానీ అప్పుడు ఎందుక‌నో కుద‌ర‌లేదు. అదే కోరిక ఇప్పుడూ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ని కోరుతున్నా. ఈ మంచి ప‌ని మీరు చేయాలి. ఇప్ప‌టి అసోసియేష‌న్ పేద‌ల్ని ఆదుకుంటోంది. సీనియ‌ర్ల‌ను స‌న్మానిస్తోంది. మంచి ప‌నులు చేస్తోంది. ఇలా చేయ‌డం బావుంది. కాక‌తాళీయ‌మే అయినా.. కైకాల‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన సీనియ‌ర్ న‌టి జ‌మున స‌హా ఇలా స‌న్మానించ‌డం బావుంది. జ‌మున గొప్ప ప్రొఫెష‌న‌ల్ న‌టి. వృత్తినిబద్ధ‌త‌తో ఉండే న‌టి. హ‌ర‌నాథ్‌, కృష్ణంరాజు వంటివారితో జ‌మున కాంబినేష‌న్ అంటే సూప‌ర్‌హిట్టే. స‌త్య‌భామగా మెప్పించారు. ఆ చిత్రంలో త‌న వ్య‌క్తిత్వానికి, ముక్కుసూటి త‌నానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించారు. గ్లామ‌ర్‌, న‌ట‌న రెండిటి క‌ల‌బోత‌గా మెప్పించ‌డం చాలా అరుదు. అది జ‌మునకే సాధ్య‌మైంది. నా ద‌ర్శ‌క‌త్వంలో గొప్ప సినిమాల్లో న‌టించారు. ఇక కైకాల గురించి చెప్పాలంటే నా 150 సినిమాల్లో 75 సినిమాల్లో ఆయ‌న న‌టుడు. ఏడాదికి 20 సినిమాలు చేస్తూ కూడా ఆఫీసుల‌కు వెళ్లి అవ‌కాశాలు అడిగేవారు. అది ఆయ‌న డెడికేష‌న్‌. ఆర్టిస్టుగా దుగ్ధ‌. రామ‌లింగ‌య్య గారు అలా ఉండేవారు. రాత్రి, ప‌గ‌లు అనే తేడాలేకుండా ప‌నిచేసేవారు. కైకాల‌ సిపాయి కూతురు(1959)లో న‌టించినా, నా తాతా మ‌న‌వ‌డులో హీరోగా న‌టించారు. సంసారం సాగ‌రంలో చ‌క్క‌ని పాత్ర‌లో నటించి మెప్పించారు. నా 75 సినిమాల్లో న‌టించినా ఎందులోనూ విల‌న్‌గా చేయ‌లేదు. అదో ప్ర‌త్యేక‌త‌. ఎస్వీ రంగారావు గారు.. నువ్వేరా నా వార‌సుడివి. నా త‌ర్వాత వేరే ఎవ‌రూ లేరు.. అనేవారు కైకాల‌తో. య‌ముడిగా, ఘ‌టోత్క‌చుడిగా ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషించి మెప్పించిన న‌ట‌సార్వ‌భౌముడు కైకాల‌. ఈ ఇద్ద‌రు లెజెండ్స్‌ని స‌త్క‌రించిన మాఅసోసియేష‌న్‌కి ధ‌న్య‌వాదాలు. మునుముందు మ‌రింత‌మంది సీనియ‌ర్ న‌టీన‌టుల‌ను ఇలానే స‌న్మానించాలి. మా అసోసియేష‌న్‌కి నా త‌ర‌పున ధ‌న్య‌వాదాలు అన్నారు.

    జ‌మున మాట్లాడుతూ -50 ఏళ్ల న‌ట‌జీవితంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వ‌ర్ జూబ్లీలు ఎన్నో చూశాం. మా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య స‌న్మానం గొప్ప సంతోషాన్నిస్తోంది. సిపాయి కూతురు చిత్రంలో జ‌మున గారు అవ‌కాశం ఇచ్చారని ఇప్ప‌టికీ చెబుతుంటారు కైకాల‌. అప్ప‌టినుంచి మేం ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతూనే ఉన్నాం. ఇప్పుడు వృద్ధాప్యం వ‌చ్చినా యాక్టివ్‌గానే ఉన్నాను. రాజేంద్ర‌ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న, శివాజీ రాజా కార్య‌ద‌ర్శిగా మా అసోసియేష‌న్ ఎన్నో మంచి ప‌నులు చేస్తోంది. వృద్ధాప్య ఫించ‌న్లు ఇస్తున్నారు. ఫించ‌న్ల కోసం నేను ఇదివ‌ర‌కే ల‌క్ష విరాళం ప్ర‌క‌టించాను. దానిని త్వ‌ర‌లోనే మాఅసోసియేస‌న్‌కి అందిస్తాను. మ‌న క‌ళ్ల ముందే మ‌న ప్రియ‌త‌మ క‌థానాయ‌కులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మ‌న‌ల్ని వీడి వెళ్లారు. న‌టీన‌టుల్లో యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు బాధించాయి. వారిని స్మ‌రించుకుందాం. మా అసోసియేష‌న్‌ ఇలా సీనియ‌ర్ల‌ను స‌న్మానించ‌డం, గౌర‌వాన్ని పెంచేదిగా ఉంది. సీనియ‌ర్ న‌టి హేమ‌ల‌త (90) ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించారు. వంద‌ల సినిమాల్లో త‌ను నాయిక‌. అలాంటి న‌టిని గౌర‌వించి తీరాలి. సీనియ‌ర్లంద‌రినీ వెతికి మ‌రీ గౌర‌వించాలి. ఈ స‌త్సాంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్న మాను అభినందిస్తున్నా. రాజేంద్ర ప్ర‌సాద్‌, శివాజీరాజా... డైన‌మిక్ లీడ‌ర్‌షిప్‌లో క‌మిటీ మ‌రిన్ని మంచిప‌నులు చేస్తూ ముందుకెళ్లాల‌ని కోరుకుంటున్నా. పేద క‌ళాకారులకు ఫించ‌న్లు ఇవ్వాల‌ని కోరుతున్నా అన్నారు.

    కైకాల స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ -పూర్వం మ‌ద్రాసులో ఓ సాంప్ర‌దాయం ఉండేది. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాక సీనియ‌ర్ల‌ను పిలిచి ప్రివ్యూ చూపించేవారు. హైద‌రాబాద్‌కి ప‌రిశ్ర‌మ వ‌చ్చాక కొన్ని సాంప్ర‌దాయాలు మారాయి. ప్రివ్యూల‌కు, స‌న్మానాల‌కు సీనియ‌ర్ల‌ను పిల‌వ‌క‌పోగా గౌర‌వించ‌క‌పోవ‌డం బాధ క‌లిగించింది. టీవీల్లో ఏవైనా ఫంక్ష‌న్స్ వ‌చ్చేప్పుడు ఇదెప్పుడు జ‌రిగింది? పిల‌వ‌లేదేంటి? అనుకునేవాడిని. ఇలాంటి సంద‌ర్భంలో మా అసోసియేష‌న్‌ ఇలా సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌డం సంతోషాన్నిస్తోంది' అన్నారు.

    జమున వల్లే

    జమున వల్లే

    జ‌మున గారు చెప్పిన‌ట్టు ఎన్నో స‌న్మానాలు, క‌న‌కాభిషేకాలు జ‌రిగినా ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌న్న‌ట్టు.. `మా` స‌న్మానం గొప్ప ఆనందాన్నిచ్చింది. ఆరోజు జ‌మున రూలింగ్ హీరోయిన్‌. త‌ను అవ‌కాశం ఇవ్వ‌క‌పోయి ఉంటే నా కెరీర్ అంత ఫ్లైయింగ్ స్టార్ట్ అయ్యేది కాదు. బ‌తికి ఉన్నంత కాలం కృత‌జ్ఞ‌త చెప్పుకోవ‌డం త‌ప్పేం కాదు. ఇప్ప‌టికి 772 సినిమాల్లో న‌టించాను. జాన‌ప‌దం, పౌరాణికం, సాంఘీకం అన్నిర‌కాల సినిమాలు చేశాను. ఇదంతా ప్రేక్ష‌కాభిమానుల ఆద‌ర‌ణ‌తోనే. మా అసోసియేష‌న్ ఇలాంటి మంచి ప‌నులు మ‌రిన్ని చేయాల‌ని ఆకాంక్షిస్తున్నా అన్నారు కైకాల.

    మా బాధ్యత

    మా బాధ్యత

    `మా` అసోసియేష‌న్ అధ్య‌క్షులు, న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ -``ఇద్ద‌రు లెజెండ్స్‌ని ఇలా ద‌ర్శ‌క‌ర‌త్న చేతుల‌మీదుగా స‌న్మానించుకోవ‌డం ఆనందాన్నిస్తోంది. మా అసోసియేష‌న్ ఇలాంటి మ‌రిన్ని మంచి ప‌నులు చేసేందుకు, స‌న్మానాలు చేసేందుకు సిద్ధంగా ఉంది. సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌డం మా బాధ్య‌త‌. ఆ ప‌నే మేం చేస్తున్నాం అన్నారు.

    ఇక ప్రతిసారీ..

    ఇక ప్రతిసారీ..

    ప్ర‌తిసారీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగుల్లో ఇలా సీనియ‌ర్ల‌ను స‌న్మానించుకుంటాం. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన పెద్ద‌లు, మా స‌భ్యులు, న‌టీన‌టులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

    కార్య‌క్ర‌మంలో

    కార్య‌క్ర‌మంలో

    ప‌రుచూరి సోద‌రులు, ఎస్వీ కృష్ణారెడ్డి, విజ‌య్ చంద‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శివ‌కృష్ణ‌, గీతాంజ‌లి, సంగీత‌, క‌విత‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, హీరోలు శ్రీ‌కాంత్‌, మంచు విష్ణు, మంచు మ‌నో్జ్‌, క‌థానాయిక‌ ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌, సీనియ‌ర్ న‌రేష్‌, మాదాల ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్‌, బెన‌ర్జీ, శ్రీ‌ల‌క్ష్మి, రాజేశ్వ‌రి, హేమ త‌దిత‌రులు పాల్గొన్నారు. వేదిక‌పై స‌న్మాన గ్ర‌హీత‌ల‌కు యువ‌త‌రం హీరోలు, న‌టీన‌టులు ప‌చ్చ‌ని మొక్క‌లు అందించి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు.

    English summary
    Movie Artists Association (MAA) Felicitated Senior Artists Kaikala Satyananarayana and Jamuna today (12th June) morning at Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X