Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
విషాదం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఇక లేరు
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) ఇక లేరు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఆయన కన్ను మూశారు.
చెన్నై: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) ఇక లేరు. చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఆయన కన్ను మూశారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి ప్రముఖ సంగీత విద్వాంసునిగా గుర్తింపు పొందారు. భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
అసలు ఏం జరిగింది?
కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం బాలమురళీకృష్ణకు ఎలాంటి అనారోగ్యం లేదు. మంగళవారం మధ్నాహ్నం భోజనం చేసిన తర్వాత ఎప్పటిలాగే నిద్రపోయారు. సాయంత్రం కుటుంబ సభ్యులు నిద్రలేపడానికి ప్రయత్నించగా....చనిపోయినట్లు గుర్తించారు.
ఎనిమిది సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు.
భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు. మంగళంపల్లి మరణంతో సంగీత ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాల్యం
బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని శంకరగుప్తంలో జన్మించాడు. ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్ముమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు.
"బాల" అని పేరుకు ముందు చేర్చి
ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనలో కచేరి చేశాడు. అతని తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ "బాల" అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.
అత్యున్నత శిఖరాలకు
బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది.
అవార్డులు, బిరుదులు
బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని : - సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి. దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించారు. కర్నాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.