నిర్మాత జయకృష్ణ ఇకలేరు, చిరంజీవికి తొలి పారితోషికం ఆయనే..
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత జయకృష్ణ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్ లో కన్నుమూసారు. కృష్ణం రాజు, జయసుధలకు మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
మనవూరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు, నీకు నాకు పెళ్లంట, సీతారాములు, కృష్ణార్జునులు, వివాహభోజనంబుతో పాటు 15 పైగా తెలుగు చిత్రాలు నిర్మించారు. మరో 20కిపైగా డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.

మనవూరి పాండవులు చిత్రంలో నటించిన చిరంజీవి...కెరీర్లో తొలిసారి రూ. 1116 పారితోషికం అందుకుంది జయకృష్ణ నుండి కావడం వివేషం. చాలా కాలం జయకృష్ణ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ మధ్య తారా చౌదరి జీవితపై సినిమా చేయాలని అనుకున్నారు. 'ఒక తార' పేరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. కానీ ఆ సినిమా కేవలం ప్రకటనకే పరిమితం అయింది.
జయకృష్ణ అనారోగ్యం పాలు కావడం వల్లనే ఆయన సినిమాను నిర్మించలేక పోయారు. జయకృష్ణ ఏకైక కుమారుడు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకున్నారు. జయకృష్ణ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications