సినీ ఇండస్ట్రీలో మరో సంచలన వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ స్టార్ హీరో సోదరుడిపై ఆయన మాజీ భార్య చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతలతో పడుకోమని, తనపై ఒత్తిడి తెచ్చారని సంచలన ఆరోపణలు చేసింది. వైవాహిక జీవితంలో శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఆ బాధితురాలు ఎవరు?
ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ఈవా గ్రోవర్.. తన మాజీ భర్త హైదర్ అలీ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయంగా మారాయి. హైదర్ అలీ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సవతి సోదరుడు కావడం ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్గా మార్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈవా, తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. దర్శకులు, నిర్మాతలతో రాజీ పడాలని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.
తాజాగా ఈవా గ్రోవర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదర్ అలీతో చాలా తక్కువ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రేమలో పడిన కొద్ది రోజుల్లోనే కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పెట్టిన, వాటిని పట్టించుకోకుండా వివాహం చేసుకున్నానని చెప్పారు. పెళ్లి తర్వాత మాత్రం ఆయన నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు. తన సినీ కెరీర్లో అవకాశాలకు ఎప్పుడూ కొరత లేదని ఈవా చెప్పారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించిన సమయంలో హైదర్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దర్శకులు, నిర్మాతలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే పని వస్తుందని, కుటుంబాన్ని నడపాలంటే అది చేయాల్సిందేనని అతడు తనపై ఒత్తిడి తీసుకవచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'హీరోయిన్స్ ఇలాంటి ప్రతిపాదనలు రావడం సహజమేనని, దాంతో ఏమవుతుంది? కుటుంబాన్ని నడపాలి. ఇంటి కరెంట్ బిల్లు చెల్లించాలి. పిల్లల కోసం డబ్బు కావాలి. కాబట్టి అది చేయాల్సిందే'అని తన మాజీ భర్త అన్నాడని ఆరోపించారు. ఆ మాటలు విన్న తర్వాతే తన జీవితంలో అన్నీ ముగిసిపోయాయని భావించానని, వెంటనే ఆ సంబంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. పెళ్లి తర్వాత కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానని ఈవా వెల్లడించారు. తన ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్లు అమ్మేశానని, కుటుంబాన్ని నిలబెట్టేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేశానని తెలిపారు. అయినప్పటికీ చివరకు తనను శారరీకంగా, మానసికంగా ఒత్తిడి చేయడం తీవ్రంగా బాధించిందని అన్నారు. ఎన్నో రోజులు నరకం అనుభవించననీ, తన శరీరంపై గాయాల మచ్చలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందేవారని చెప్పారు. పెళ్లి తర్వాత తాను అనేక రకాల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అలాగే.. హైదర్ అలీకి స్కిజోఫ్రేనియా ఉందని, అయితే పెళ్లి చేసుకునే సమయంలో తనకు ఈ విషయం తెలియదని చెప్పారు. మా ఇద్దరి మధ్య పరిచయం చాలా తక్కువగా ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ముందుగా తెలుసుకోలేకపోయానని వెల్లడించారు. అన్ని చేదు అనుభవాలు ఎదురైనా, ప్రస్తుతం హైదర్ పరిస్థితి చూసి తనకు బాధగా ఉంటుందని ఈవా అన్నారు. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని, కొన్నిసార్లు స్నేహితుల వద్ద, మరికొన్నిసార్లు ఇతరుల సహాయంతో జీవిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే.. పలు మీడియా కథనాల ప్రకారం.. హైదర్కు ఆమిర్ ఖాన్ లేదా ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధాలు లేవని చెబుతున్నారు. ఇక ఈవా గ్రోవర్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హైదర్ అలీ ఖాన్ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే, ఈ ఆరోపణలపై ఆమిర్ ఖాన్ కుటుంబం నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవి ఈవా గ్రోవర్ చేసిన ఆరోపణలు మాత్రమేనా? నిజంగా వేధింపులకు గురి అయిందా? అనేది తెలియలంటే.. మరిన్ని రోజులు వేచి చూడాలి.More Articles