భారతీయ సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ధురంధర్ చిత్రం ప్రస్తుతం జపాన్ దేశంలో రిలీజైంది. ఆదిత్య ధార్ దర్వకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను జపాన్లో రిలీజ్ చేయగా భారీగానే ఎదురు దెబ్బ తగిలిందనే వార్తలు ప్రాథమికంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో పేలవంగా ఈ సినిమా తన బాక్సాఫీస్ జర్నీని ఘోరమైన పరిస్థితుల్లో మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జూలై 10వ తేదీన రిలీజైన ఈ సినిమా పరిస్థితి ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం పార్ట్ 1 సుమారుగా 1428 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దురంధర్ పార్ట్ 2గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ చిత్రం తొలి ఆట నుంచే భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్లో 1850 కోట్ల రూపాయలను వసూలు చేసి భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసింది. దాంతో ఈ చిత్రం 3200 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ సినిమాను భారీ అంచనాల మధ్య జూలై 10వ తేదీన జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా రిలీజ్కు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సినిమాను దాదాపు 80 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను భారీగా ఆదరిస్తారని ఊహించిన చిత్ర యూనిట్కు ఆడియెన్స్ భారీగానే షాకిచ్చారు. ఈ చిత్రం తొలి రోజున 57 లోకేషన్లలో 450 మంది ప్రేక్షకులు చూశారు. ఆ రోజు మొత్తంగా 80 లొకేషన్లలో 900 మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించారు అని గల్ఫ్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. జపాన్లో ధురంధర్ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. ఈ వారం అక్కడ రిలీజైన సినిమాల్లో కనీసం టాప్ 25 సినిమాల్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అత్యంత నిరాశజనకంగా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా పుంజుకొంటుందా? మెరుగైన వసూళ్లను సాధిస్తుందా? అనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి. జపాన్లో ఇండియన్ సినిమాల ఓపెనింగ్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు RRR సినిమా టాప్ ప్లేస్లో ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు 8230 మంది చూశారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాను 6510 మంది చూశారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన కల్కిని మొదటి రోజు 3700 మంది వీక్షించారు. పఠాన్ను 2220 మంది, జవాన్ను 1960 మంది, రంగస్థలం సినిమాను 1610 మంది, దేవరను 1550 మంది చూశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దురంధర్ 2. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే.More Articles