ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్టార్ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రాకా'. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భారీ బడ్జెట్, హై టెక్నాలజీ, ఇంటర్నెషనల్ లెవల్ విజువల్స్‌తో రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement

తాజాగా సమాచారం ప్రకారం.. 'రాకా'లో అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా నాలుగు వేర్వేరు పాత్రల్లో నటించనున్నారట. ఒకే సినిమాలో నాలుగు తరాలకు చెందిన పాత్రలను పోషించేలా కథను అట్లీ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే తొలి మల్టిపుల్ రోల్ మూవీ కానుంది. అలాగే సినీ పరిశ్రమలోనూ ఇది అరుదైన ప్రయోగమేనని చెప్పాలి.

అయితే.. సినీ వర్గాల్లో కథనం ప్రకారం.. మొదట దర్శకుడు అట్లీ ఈ కథను డబుల్ రోల్ కాన్సెప్ట్‌తోనే డిజైన్ చేశారట. తండ్రి, తాత పాత్రలకు అనుభవజ్ఞులైన ఇతర నటులను ఎంపిక చేయాలని భావించినట్లు సమాచారం. అయితే, పూర్తి కథ విన్న అల్లు అర్జున్, అన్ని పాత్రలను తానే చేయాలని ఆసక్తి చూపారట.

Advertisement

దీంతో మూవీ ప్రత్యేక లుక్ టెస్టులు నిర్వహించిందని, ఆ టెస్టుల్లో ప్రతి పాత్రకు బన్నీ చూపించిన వైవిధ్యం అందరినీ ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో నాలుగు పాత్రలు ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ కలిగిస్తాయేమోనని అట్లీకి సందేహం ఉన్నప్పటికీ, మేకోవర్, బాడీ లాంగ్వేజ్, నటనలో అల్లు అర్జున్ చూపించిన తేడాలు చూసిన తర్వాత ఇదే సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై మూవీ మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

అట్లీ తెరకెక్కించే సినిమాల్లో ఎమోషన్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 'రాజా రాణి', 'తెరి', 'మెర్సల్', 'బిగిల్', 'జవాన్' వంటి చిత్రాలతో ఆయన తన ప్రత్యేక ముద్ర వేశారు. ఈసారి అల్లు అర్జున్‌తో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో 'రాకా'ను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ - దీపికా జోడీ తొలిసారి తెరపై కనిపించనుండటంతో ఈ కాంబినేషన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబైలో కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్లు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సమాచారం అంతా పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మాత్రమే. అల్లు అర్జున్ నిజంగానే నాలుగు పాత్రల్లో నటిస్తున్నారా? కథలో వాటి ప్రాధాన్యం ఏమిటి? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న 'రాకా'ను 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.