సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్టులు హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మురుగన్ (కార్తికేయ స్వామి) నేపథ్యంతో తెరకెక్కనున్ 'గాడ్ ఆఫ్ వార్', మరోవైపు ధనుష్-వెట్రిమారన్ కాంబోలో 'మురుగన్' అనే సినిమా రాబోతుంది. ఒకే దైవ నేపథ్యాన్ని టచ్ చేస్తూ ఈ రెండు సినిమాలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. కథలు ఒకేలా ఉంటాయనే అధికారిక సమాచారం లేకపోయినా, మురుగన్ దైవానికి సంబంధించిన అంశం కారణంగా సినిమాల మధ్య పోలికలు మొదలయ్యాయి.
కోలీవుడ్లో మోస్ట్ సక్సెస్ కాంబినేషన్లలో ధనుష్-వెట్రిమారన్ జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.'పొల్లాదవన్', 'ఆడుకాలం', 'వడ చెన్నై', 'అసురన్'వంటి సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 'అసురన్' సినమాతో ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ కాంబో మళ్లీ కలిసి సినిమా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'D x V'అంటూ ధనుష్ చేసిన పోస్టులు ఆసక్తి రేకెత్తించాయి. చివరకు అవి వెట్రిమారన్తో కొత్త సినిమా కోసమేనని వెల్లడిస్తూ'తమిళ్ మురుగన్'టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను వండర్బార్ ఫిలిమ్స్, మైల్స్ టు గో సంస్థలు నిర్మిస్తున్నాయి. కథను అరివుమతి అందిస్తుండగా, యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.\ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్లో ధనుష్ భారీ ఏనుగుపై యోధుడిగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యుద్ధభూమి నేపథ్యం, చేతిలో మురుగన్ ఆయుధమైన 'వేల్', వెనుక వేలాది మంది సైనికులతో రూపొందించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. "ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, కింగ్ ఆఫ్ తమిళ్ ల్యాండ్" అనే భావాన్ని ప్రతిబింబించేలా ఈ వీడియోను రూపొందించారు. తమిళ సంస్కృతిలో మురుగన్కు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను హిస్టారికల్-ఎపిక్ శైలిలో రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్తో పోలికలు మరింత పెరిగాయి. ఇటీవల ప్రకటించిన 'గాడ్ ఆఫ్ వార్' సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా కార్తికేయ స్వామి లేదా మురుగన్కు సంబంధించిన నేపథ్యంతో తెరకెక్కబోతున్నని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఆ ప్రకటన తర్వాత తమిళనాడులో కొంత వివాదం కూడా చెలరేగింది. మురుగన్ తమిళుల ఆరాధ్య దైవమని, ఆయన చరిత్రను ఎలా చూపిస్తారనే అంశంపై రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు స్పందించాయి.ఇప్పుడు అదే సమయంలో ధనుష్-వెట్రిమారన్ 'తమిళ్ మురుగన్' ప్రకటించడంతో రెండు సినిమాలపై చర్చ మరింత వేగం అందుకుంది. అయితే రెండు చిత్రాల కథాంశాలు ఒకేలా ఉంటాయని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, ఎన్టీఆర్ కి పోటీగా ధనుష్ వస్తున్నారు. అలాగే.. త్రివిక్రమ్- వెట్రిమారన్ మధ్య అసలైన పోరు మొదలైందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, త్రివిక్రమ్ తనదైన శైలిలో పురాణ నేపథ్యాన్ని ఆధునిక కథనంతో మిళితం చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వెట్రిమారన్ మాత్రం చారిత్రక, సామాజిక అంశాలను వాస్తవికంగా చూపించే దర్శకుడిగా గుర్తింపు పొందారు. అందువల్ల ఒకే దైవం ఆధారంగా తీసుకున్నప్పటికీ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన కథలు, భిన్నమైన ట్రీట్మెంట్తో రూపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 'తమిళ్ మురుగన్'కు అనిరుధ్ టీమ్లో గతంలో పనిచేసిన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. గురువు-శిష్యులుగా పేరొందిన ఈ ఇద్దరు సంగీత దర్శకులు వేర్వేరు భారీ చిత్రాలకు పనిచేయడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.మొత్తానికి, ధనుష్-వెట్రిమారన్ 'తమిళ్ మురుగన్', ఎన్టీఆర్-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్'లు హట్ టాపిక్ గా మారాయి.More Articles