God of War: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా 'గాడ్ ఆఫ్ వార్'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అరవింద సమేత' తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్తో ఈ ప్రాజెక్ట్పై మరింత హైప్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?
త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కేవలం పాటలు, గ్లామర్కే పరిమితం కావు. కథను ముందుకు నడిపించే బలమైన పాత్రలుగానే ఉంటాయి. అందుకే 'గాడ్ ఆఫ్ వార్'లో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా వస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ కియారా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పౌరాణిక కథలో కీలక పాత్ర? ఎన్టీఆర్తో కొత్త కాంబినేషన్ అయితే కియారా పేరు బయటకు రావడంతో మరో చర్చ కూడా మొదలైంది. ఆమె నటించిన తెలుగు సినిమాల్లో 'భరత్ అనే నేను'విజయం సాధించినా.. 'వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో కొందరు అభిమానులు ఈ సెంటిమెంట్ను కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం స్టార్ హీరోయిన్కు ఇలాంటి సెంటిమెంట్లు వర్తించవని అంటున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే.. ఆమెపై ఉన్న సందేహాలు కూడా తొలగిపోతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో 'టాక్సిక్' ఫలితం కూడా 'గాడ్ ఆఫ్ వార్' చర్చల్లో ప్రస్తావనకు వస్తోంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ దర్శకత్వంలోని 'గాడ్ ఆఫ్ వార్' సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ వార్'లో కియారా అద్వానీ నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ వార్తపై స్పష్టత రావాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
'గాడ్ ఆఫ్ వార్' సినిమా కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) కథ ఆధారంగా రూపొందుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మురుగన్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పురాణాల ప్రకారం మురుగన్కు శ్రీవల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉంటారు. దీంతో ఈ రెండు పాత్రల్లో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అందులో ఒక పాత్ర కోసం కియారాను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కియారా పేరు వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
కియారా అద్వానీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించారు. అయితే ఎన్టీఆర్తో ఇప్పటివరకు ఆమె స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఎన్టీఆర్-కియారా ఫ్రెష్ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశముందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.More Articles