సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్స్ పోటీ పడుతుంటారు. మార్కెట్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల తొలి చిత్రంతోనే ఘనవిజయం అందుకున్న యువ దర్శకుడు కూడా మహేష్ తోనే తన తదుపరి చిత్రం ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్న సందీప్ వంగా సూపర్ స్టార్ మహేష్ తో టచ్ లో ఉంటున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా గురించి వార్తలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మించనున్నారు. ఈ లెక్కన సందీప్ వంగా మరో ఏడాది వరకూ వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం ఈ దర్శకుడు హిందీలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.
ఎప్పుడో ప్రారంభమయ్యే సందీప్ మహేష్ సినిమా కోసం నిర్మాతల మధ్య ఇప్పటి నుంచే రేసు మొదలైనట్లు తెలుస్తోంది. మహేష్ తో ఓ బడా చిత్రాన్ని నిర్మించాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారట. సందీప్, మహేష్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూడా ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రాన్ని నిర్మించేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఎవరికి పచ్చ జెండా ఊపుతాడో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.