ఐశ్వర్య రాజేశ్... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పదహారణాల తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కని ఓ నటి. అయితే ప్రతిభకు ఎక్కడైనా గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందని నమ్మి కోలీవుడ్‌లో వరుస అవకాశాలు హిట్స్‌తో అగ్రనటిగా వెలుగొందుతోంది. సొంత ఇండస్ట్రీ తనను దూరంగా పెట్టినా పరాయిగడ్డ అక్కున చేర్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మంచి ఊపు మీదున్న ఐశ్వర్య తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

దివంగత హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్.. దిగ్గజ హాస్యనటి శ్రీలక్ష్మీ ఈమెకు స్వయానా మేనత్త. తండ్రి ఆకస్మిక మరణంతో వీరి కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. అయితే తల్లి మాత్రం పిల్లలను బాగా చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఐశ్వర్యకు చాలా కాలమే పట్టింది. కెరీర్ తొలినాళ్లలోనే ఆమె రంగు గురించి హేళనగా మాట్లాడినా తట్టుకుని, తన ప్రతిభతోనే సమాధానం చెప్పారు ఐశ్వర్య రాజేష్.

21 ఏళ్ల వయసులోనే ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి శెభాష్ అనిపించుకున్నారు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో సత్తా చాటుతోంది. కౌశల్య కృష్ణమూర్తి, మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్, సంక్రాంతికి వస్తున్నాం, ఓ సుకుమారి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు తమిళంలో వచ్చినంతగా టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఐశ్వర్య నటించిన నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఐశ్వర్య రాజేష్. ఈ క్రమంలోనే మీకు కూడా ఖచ్చితంగా క్యూట్ క్రష్ స్టోరీ ఉండే ఉంటుంది అదేంటో చెబుతారా అని ఓ కుర్రాడు అడగ్గా.. దానికి ఐశ్వర్య సమాధానం ఇచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అంటే నాకు పిచ్చి. అప్పటికే నేను హీరోయిన్‌ని, అతను కూడా బాలీవుడ్‌లో రాణిస్తున్నాడు. సుశాంత్ భలే ఉన్నాడు కదా? క్యూట్‌గా ఉన్నాడు కదా? అని మా ఫ్రెండ్స్‌తో చెబుతూ ఉండేదానిని. దాంతో ఆపవే బాబు అంటూ ఏడిపించేవారు. అయితే ఓసారి నేను గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లాను. చక్కగా చీర కట్టుకుని తమిళనాడు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నా, నాతో పాటు కొందరు తమిళ నటీనటులు ఉన్నారు.

కట్ చేస్తే నా ముందు వరుసలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూర్చొని ఉన్నారు. నన్ను మా ఫ్రెండ్స్‌ అమ్ములు అని పిలిచేవారు.. ముందుగా ఉన్న సుశాంత్‌ని చూసి అమ్ములు.. అమ్ములు సుశాంత్ వచ్చాడని గోల చేయడం మొదలుపెట్టారు. నేను ఏ సుశాంత్ అని అడగ్గా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అని చెప్పడంతో షాక్ అయిపోయా. ఆయనతో ఒక్క ఫోటో తీసుకోవాలని అనుకున్నా.. ఎందుకంటే సుశాంత్ అంటే అంత పిచ్చి. నైట్ పార్టీ ఉంది కదా? అక్కడ ఫోటో తీసుకుందువు గానీ అని కూల్ చేశారు. ఒకవేళ రాకపోతే అని నేను డౌట్ పడి అలాగే రూమ్‌కి వెళ్లిపోయాం.

నువ్వు చాలా పిచ్చిగా చేస్తున్నావు.. నువ్వు కూడా ఓ నటివి అన్న సంగతిని గుర్తుపెట్టుకోమని మా ఫ్రెండ్స్ క్లాస్ పీకారు. సరేనని నైట్ పార్టీకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం వెళితే.. ఆయన రాలేదు. ఫెస్టివల్ ముగియడంతో తర్వాతి రోజు హోటల్ రూమ్ చెక్ఔట్ చేస్తున్నాం. అయితే నా పక్కనే ఒక రూమ్ ఉంది.. ఇందులో ఎవరున్నారు అని హోటల్ స్టాఫ్‌ని అడిగితే సుశాంత్ రాజ్‌పుత్ ఉన్నాడని వాళ్లు చెప్పగానే నేను షాకయ్యా. నాతో పాటు నా పక్క రూమ్‌లోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉన్నాడని తెలిసి బాధపడ్డాను. పక్కనే పెట్టుకుని అనవసరంగా పార్టీకి వెళ్లామని మా ఫ్రెండ్స్‌ని తిట్టేశా. సుశాంత్ అద్భుతమైన నటుడు.. చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయనంటే ఎంతో ఇష్టమని, కానీ సుశాంత్‌తో ఫోటో దిగలేకపోయానని ఐశ్వర్య రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.