స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చందమామ.. పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా అదే జోరుతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం 'ది ఇండియా స్టోరీ' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజల్.. తాజాగా తన సినీ కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. నటిగా తాను పాటించే విలువలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Advertisement
Advertisement

ది ఇండియా స్టోరీ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. కాజల్ మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని వ్యక్తిగత హద్దులు పెట్టుకున్నానని చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం లేదా అవకాశాలు కోల్పోతామనే భయంతో ఆ హద్దులను ఎప్పుడూ దాటలేదని స్పష్టం చేశారు. గ్లామర్ కంటే పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలనే ఎంచుకున్నానని తెలిపారు. "నా కెరీర్‌లో ఇప్పటివరకు బికినీ సీన్స్ చేయలేదు. నాభి అందాలను ప్రత్యేకంగా చూపించే సన్నివేశాలు కూడా చేయలేదు. అలాగే ఇంటిమేట్ సీన్స్‌కు కూడా దూరంగా ఉన్నాను. అవి నా వ్యక్తిగత నిర్ణయాలు. ఎవరినీ విమర్శించడం కోసం కాదు. నాకు నేను పెట్టుకున్న పరిమితులు మాత్రమే" అని కాజల్ వివరించారు.

Advertisement

చాలా సినిమాలు వదులుకున్నా
కొన్ని భారీ ప్రాజెక్టులు కేవలం కొన్ని సన్నివేశాల కారణంగానే వదులుకున్నానని కాజల్ వెల్లడించారు. "నాకు అసౌకర్యంగా అనిపించే సన్నివేశాలు ఉంటే ఎంత పెద్ద సినిమా అయినా అంగీకరించలేదు. అవకాశాల కంటే మనసుకు నచ్చే పాత్రలు ముఖ్యం" అని చెప్పారు. తల్లి అయిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని కాజల్ అన్నారు. "నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసేటప్పుడు అసౌకర్యంగా ఫీలవ్వకూడదు. నా సినిమాలు చూసి గర్వపడాలి " అని చెప్పారు.

Advertisement

అయితే.. తన నిర్ణయాలను ఇతర నటీమణులతో పోల్చొద్దని కాజల్ అన్నారు. "ప్రతి నటుడు, ప్రతి నటి తమకు నచ్చిన పాత్రలు ఎంచుకునే హక్కు ఉంది. ఎవరి నిర్ణయాలు వారివి. నేను తీసుకున్నది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఇందులో ఎవరినీ తప్పుబట్టడం లేదు" అని పేర్కొన్నారు. దక్షిణాది చిత్రపరిశ్రమ తనకు ఎంతో గౌరవం ఇచ్చిందని కాజల్ అన్నారు. "సౌత్‌లో నాకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎక్కువగా వచ్చాయి. నటనకు అవకాశం ఉన్న పాత్రలు దక్కాయి. అందుకే ఇక్కడ ఎక్కువకాలం కొనసాగగలిగాను" అని చెప్పారు.

Advertisement

బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని కాజల్ అన్నారు. "అక్కడ సగటు పాత్రలు చేయడం కంటే, సౌత్‌లో మంచి పాత్రలు చేయడం నాకు నచ్చింది. భాష ఎప్పుడూ నాకు అడ్డంకి కాలేదు. కానీ కథ, పాత్ర మాత్రం చాలా ముఖ్యం" అని వెల్లడించారు. బాలీవుడ్ పని విధానంపై కూడా కాజల్ మాట్లాడారు. "ఒకసారి సల్మాన్ ఖాన్ కోసం చాలా గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆయన సాయంత్రం వచ్చారు. కానీ సౌత్‌లో షూటింగ్‌లు చాలా క్రమశిక్షణగా జరుగుతాయి. సమయపాలనకు నేను అలవాటు పడిపోయాను. అందుకే దక్షిణాది వర్క్ కల్చర్ నాకు బాగా నచ్చింది" అని తెలిపారు.

Advertisement

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రేయాస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' సినిమాలో కూడా కాజల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.