ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ హీరోయిన్లకు కథలో కీలకమైన సన్నివేశాలు, గుర్తుండిపోయే పాత్రలు ఉండేవి. కానీ ఇటీవల భారీ హీరోల సినిమాల్లో చాలా వరకు హీరోయిన్ల పాత్రలు గ్లామర్, పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాల్లో అయితే కథతో పెద్దగా సంబంధం లేకుండానే హీరోయిన్లను చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై తాజాగా నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యంపై చర్చకు దారితీశాయి.

Advertisement
Advertisement

నటి మాధవీలత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2007లో మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2008లో విడుదలైన 'నచ్చావులే' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం 'ష్', 'స్నేహితుడా', 'అరవింద్ 2, చూడాలని చెప్పాలని' వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ప్రయత్నించింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలక సభ్యురాలిగా కొనసాగుతోంది.

Advertisement

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవీలత.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. 'ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సిందే. కానీ స్టార్ హీరోల సినిమాల్లో నిజంగా హీరోయిన్లకు నటనకు అవకాశం ఉండే పాత్రలు దక్కుతున్నాయా?'అంటూ ఆమె ప్రశ్నించింది. ఈ సందర్భంగా సమంత నటించిన 'మా ఇంటి బంగారం', 'బ్లాస్ట్'వంటి మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఉదాహరణగా ప్రస్తావించింది. 'ఆ సినిమాల్లో హీరో లేకపోవడం వల్ల కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే నటిగా తన ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. కానీ స్టార్ హీరోల సినిమాల్లో అలాంటి పరిస్థితి కనిపించదు'అని చెప్పింది.

Advertisement

రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలను ప్రస్తావిస్తూ.. 'ఈ సినిమాల్లో హీరోయిన్లకు నిజంగా ఎంత విలువ ఉంటుంది? ఎక్కువగా పాటలు, గ్లామర్, రెండు మూడు రొమాంటిక్ సన్నివేశాలకే వారి పాత్ర పరిమితమవుతోంది. హీరోతో సమానమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది' అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు, 'ఈ విషయాన్ని గట్టిగా చెబితే చాలామందికి కోపం వస్తుంది. గతంలో తమన్నా కూడా హీరోయిన్ల పాత్రల గురించి ప్రశ్నించినప్పుడు ఆమెపై విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె ఎలాంటి వివాదాల్లోకి వెళ్లడం లేదు. కానీ అసలు సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది'అని మాధవీలత పేర్కొంది.

Advertisement

మాధవీలత వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలే అయినప్పటికీ, ఆమె ప్రస్తావించిన అంశంపై చాలా కాలంగా సినీ పరిశ్రమలో చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కథను ముందుకు నడిపించేలా కాకుండా, హీరో పరిచయం, ప్రేమకథ, పాటలు, గ్లామర్ వరకు మాత్రమే పరిమితమవుతున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి.