నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు. సినిమా ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఆమె నటిస్తున్న 'మైసా' (MYSAA)సినిమా నుంచి అప్‌డేట్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సంగతేంటీ?

Advertisement
Advertisement

రష్మిక కెరీర్‌ను పరిశీలిస్తే.. ఆమె కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె, 'యానిమల్'తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'ఛావా','సికందర్', తాజాగా 'కాక్‌టెయిల్ 2' వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా మార్కెట్ ను మరింత బలపరుచుకున్నారు. ఆమె నటించిన సినిమాలు విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించడం ఆమె క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న 'మైసా' సినిమా ఆమె కెరీర్‌లో మరో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక ఒక గోండు గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే ఈ పాత్ర అనే చెప్పాలి. కథలో యాక్షన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో రష్మిక అనేక రిస్కీ స్టంట్స్‌ను స్వయంగా చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా అప్‌డేట్ ప్రకారం.. ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారిగా ఏ హీరోయిన్ చేయని సాహసం రష్మిక చేసిందట. ఒక హీరోయిన్‌పై అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాత అజయ్ సాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. "రష్మిక మందన్నతో ఉత్కంఠభరితమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయింది" అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రకటనతో పాటు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో రష్మిక స్కూబా గేర్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

Advertisement

ఈ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్కూబా డైవింగ్, నీటి అడుగున శ్వాస నియంత్రణ, యాక్షన్ మూవ్‌మెంట్స్, ఫైట్ కొరియోగ్రఫీ వంటి అంశాల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఈ షూట్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisement

'మైసా'లో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. టీ-సిరీస్‌తో కలిసి అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ భారీ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే టీజర్ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయంతో ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు.