బిగ్బాస్ హిందీ సీజన్ 13 షోతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించిన నటి షెహ్నాజ్ గిల్ (Shehnaaz Gill). పైకి నవ్వుతూ కనిపించిన అమ్మడు జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. బిగ్ బాస్లో తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఆమె, అదే షోలో నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో పడింది. షో ముగిసిన తర్వాత ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నారు. కానీ, విధి మరోలా నిర్ణయించింది. 2021లో సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరిణించారు. దీంతో షెహ్నాజ్ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఆ ఘటన నుంచి కోలుకుని తన కెరీర్పై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ అవకాశాలు, తాను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాననే విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
బిగ్బాస్ తర్వాత షెహ్నాజ్కు సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. ఆయన హీరోగా నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత 'థ్యాంక్ యూ ఫర్ కమింగ్' సినిమాలో కూడా నటించారు. అనంతరం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమాలో ఒక ప్రత్యేక డాన్స్ నంబర్లో కనిపించారు. అయితే జాన్ అబ్రహాం, రితేష్ దేశ్ముఖ్, నోరా ఫతేహీతో కలిసి నటించాల్సిన భారీ మల్టీస్టారర్ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో షెహ్నాజ్ మళ్లీ పంజాబీ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు.
తాజాగా నటి షెహ్నాజ్ గిల్ (Shehnaaz Gill) ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు రావడం లేదనే విషయం పూర్తిగా నిజం కాదని చెప్పారు. అయితే, పంజాబీ చిత్ర పరిశ్రమలో తనకు మరింత గుర్తింపు ఉందని వెల్లడించారు. "పంజాబీ సినిమాల్లో నాకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి అసలు ఆఫర్లు రావడం లేదని నేను చెప్పను. కానీ పంజాబీ ఇండస్ట్రీలో నేను స్టార్గా మారాను. అది నిజం. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుతం పాపులర్గా ఉన్నవారికే ఎక్కువ అవకాశాలు వస్తాయి" అని షెహ్నాజ్ తెలిపారు. అంతేకాదు, "పంజాబీ సినిమాల్లో నాకు హీరోయిన్గా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అక్కడ మహిళా నటీమణులు కూడా తక్కువ మంది ఉండటం మరో కారణం" అని ఆమె చెప్పారు. అయితే అవకాశాలు ఎక్కువగా రావడమే తనకు ముఖ్యం కాదని షెహ్నాజ్ స్పష్టం చేశారు. గత ఐదు, ఆరు సంవత్సరాలుగా పంజాబీ దర్శకులు ఎన్నో కథలు వినిపించారని చెప్పారు. కానీ వాటిలో చాలా కథలు తనను నచ్చలేదు' అని వెల్లడించారు. "చాలా స్క్రిప్ట్లలో నాకు పెద్దగా నటించే అవకాశం ఉండేది కాదు. కేవలం నవ్వాలి. చిరునవ్వుతో కనిపించాలి. అంతే. అలాంటి పాత్రలు నాకు ఆసక్తి కలిగించలేదు. నేను మంచి పాత్రల్లో చేయాలనుకుంటాను. అందుకే చాలా సినిమాలను వదిలేశాను" అని షెహ్నాజ్ గిల్ వివరించారు. "కేవలం బాలీవుడ్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఏ పాత్రకైనా ఒప్పుకోను. నా పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాలి. కథలో కీలకంగా ఉండాలి. అలాంటి పాత్రలే చేస్తాను" అని షెహ్నాజ్ గిల్ స్పష్టం చేశారు. సినిమాలో ప్రతి సన్నివేశంలో కనిపించాలనే కోరిక తనకు లేదని కూడా చెప్పారు. "నా పాత్ర కథను ముందుకు తీసుకెళ్లాలి. కథలో కీలకమైన మలుపులు తీసుకురావాలి. అలాంటి పాత్ర వస్తే చిన్నదైనా నేను చేస్తాను. కానీ పేరు కోసం మాత్రమే సినిమాలు చేయను" అని అన్నారు. ఇకపై పెద్ద సినిమాల్లో డాన్స్ నంబర్లు చేయనని స్పష్టం చేశారు. సినిమా ఎంత పెద్దదైనా తన నిర్ణయం మారదని చెప్పారు. "నేను కేవలం గ్లామర్ కోసం సినిమాలో ఉండాలనుకోవడం లేదు. నేను ఆట బొమ్మను కాదు . మూడు పాటల్లో మాత్రమే కనిపించే హీరోయిన్గా ఉండాలని నేను అనుకోవడం లేదు" అని షెహ్నాజ్ గిల్ అన్నారు. తాను రాధికా ఆప్టే లాంటి నటిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాధికా ఆప్టే గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, అదే తనకు కూడా ఆదర్శమని షెహ్నాజ్ గిల్ తెలిపారు. "రాధికా ఆప్టే చేసే పాత్రలు నాకు చాలా ఇష్టం. ఆమె కేవలం అందం కోసం సినిమాల్లో ఉండరు. ఆమె పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. నేను కూడా అలాంటి నటిగా గుర్తింపు పొందాలను కుంటున్నాను" అని షెహ్నాజ్ చెప్పారు. షెహ్నాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.More Articles