తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్. ఈ ముద్దుగమ్మ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె కామెడీతో కాదు.. సోషల్ మీడియాలో తనకు ఎదురైన ట్రోలింగ్ గురించి వెల్లడిస్తూ బాధపడింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయంగా మారాయి. తాజాగా ఓ యూబ్యూట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యుల్లేఖ.. పెళ్లి తర్వాత తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి వెల్లడించారు.

Advertisement
Advertisement

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ 2021లో ఫిట్‌నెస్ ట్రైనర్ సంజయ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో గడిపిన అందమైన క్షణాలను అభిమానులతో పంచుకోవాలని భావించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిలో ఆమె స్విమ్‌సూట్ ధరించి కనిపించడం కొందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. అత్యంత దారుణంగా కామెంట్స్ పెట్టారట.

Advertisement

ఈ విషయంపై విద్యుల్లేఖ మాట్లాడుతూ.. "హనీమూన్‌కు వెళ్లాను. సముద్రంలో ఉన్నాను. అలాంటప్పుడు స్విమ్‌సూట్ వేసుకుంటే తప్పా? ఓషన్‌లోకి వెళ్తే చీర కట్టుకోవాలా? లేక పంజాబీ డ్రెస్ వేసుకోవాలా?" అంటూ ప్రశ్నించారు. పరిస్థితికి తగిన దుస్తులు ధరించడం సహజమని, దాన్ని కూడా తప్పుగా చూపించడం బాధాకరమని అన్నారు. ఆ సమయంలో తన ఫొటోలపై వచ్చిన కామెంట్లలో చాలా వరకు బాడీ షేమింగ్‌తో నిండిపోయాయని చెప్పారు. ఒకప్పుడు తాను లావుగా ఉన్నప్పుడు కూడా విమర్శించారని, ఇప్పుడు బరువు తగ్గిన తర్వాత కూడా అదే విధంగా ట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.

Advertisement

"లావుగా ఉన్నా ట్రోల్ చేశారు.. సన్నగా ఉన్నా ట్రోల్ చేస్తున్నారు. అసలు వాళ్లకు ఏది నచ్చుతుందో నాకు అర్థం కాదు" అని అన్నారు. ఓ నెటిజన్ అయితే.. "మీరు విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు?" అని కామెంట్ చేయడం చాలా బాధపెట్టిందన్నారు. "డ్రెస్ వేసుకున్న విధానానికి, నా పెళ్లి జీవితానికి సంబంధం ఏమిటి? ఎవరి వ్యక్తిగత జీవితంపై ఇలా మాట్లాడే హక్కు ఎవరికుంది?" అని ప్రశ్నించారు. సమాజంలో ఇప్పటికీ డబుల్ స్టాండర్డ్స్ కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. "ఒక హీరోయిన్ బికినీ వేస్తే అందరూ గ్లామర్ అంటారు. అదే నేను స్విమ్‌సూట్ వేసుకుంటే ఎందుకు తప్పు అవుతుంది? హీరోయిన్లకు మాత్రమే ఆ హక్కు ఉందా? మిగతా నటీమణులు మనుషులు కాదా?" అంటూ ప్రశ్నించారు.

Advertisement

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చినప్పటికీ, దాన్ని కొందరు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారని విద్యుల్లేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు రావడం బాధాకరమని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్టిస్టులు మానసికంగా దెబ్బతింటారని అభిప్రాయపడ్డారు. "ట్రోల్స్‌కు కావాల్సింది మన స్పందనే. మనం రియాక్ట్ అయితే వాళ్లు ఇంకా ఎక్కువగా ట్రోల్ చేస్తారు. అందుకే నేను ఇప్పుడు అలాంటి కామెంట్లను పూర్తిగా పట్టించుకోవడం మానేశాను" అని విద్యుల్లేఖ చెప్పారు. ట్రోల్స్‌ను ఫీడ్ చేస్తే వాళ్లే పెరుగుతారని, అందుకే నిశ్శబ్దమే సరైన సమాధానమని అన్నారు.

Advertisement

తనపై వచ్చిన కామెంట్లు విమర్శలు కాదని విద్యుల్లేఖ స్పష్టం చేశారు. "అవి కన్స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ కాదు. అది ఒక అభిప్రాయం కూడా కాదు. అది కేవలం ప్యూర్ హేట్ మాత్రమే" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి మనసులో ఎంత నెగిటివిటీ ఉంటే ఇలాంటి కామెంట్లు చేస్తారో అర్థం కావడం లేదని చెప్పారు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని, కానీ దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ప్రతి సెలబ్రిటీ జీవితంలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తాయని, వాటిని తట్టుకునే మానసిక ధైర్యం ఉండాలని అన్నారు. "100 శాతం పాజిటివ్ కామెంట్లు మాత్రమే వచ్చే సెలబ్రిటీ ఎవరూ ఉండరు" అని పేర్కొన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లకే ఎక్కువ లైక్స్ వస్తున్నాయని విద్యుల్లేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆర్టిస్టుగా అది చాలా నిరుత్సాహానికి గురి చేస్తుందని అన్నారు. అయినప్పటికీ, అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. ఇక సినీ పరిశ్రమలో తన అనుభవాల గురించి కూడా విద్యుల్లేఖ మాట్లాడారు. ఇప్పటివరకు ఏ హీరో, హీరోయిన్ లేదా దర్శకుడు తనను అవమానించేలా ప్రవర్తించలేదని చెప్పారు. తాను వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తినని, అందుకే అందరితో మంచి అనుబంధం కొనసాగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుల్లేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.