తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK)వ్యవస్థాపకుడు, దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్'. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాను కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్.కే నిర్మించారు. ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుండగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన జననాయగన్ సెన్సార్కు సంబంధించిన పలు ఇబ్బందులను ఎదుర్కొని, దాదాపు ఏడు నెలల తర్వాత విడుదలకు సిద్ధమైంది. అన్ని అడ్డంకులను దాటుకుని జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే.. సినిమా విడుదలకు ముందే లీక్ కావడం, ఆ లీక్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలపై తాజాగా దర్శకుడు హెచ్. వినోద్ తొలిసారి స్పందించారు.
ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ హెచ్ వినోద్ ఓ ఇంటర్వ్యూలో మట్లాడారు. "సినిమాను కావాలనే లీక్ చేశారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తిగతంగా చాలా బాధించాయని చెప్పారు. దాదాపు రూ.400 కోట్లతో 'జన నాయగన్' నిర్మించామని, అంత భారీ బడ్జెట్తో రూపొందిన సినిమాను నిర్మాతలే ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తారా? అందులో వారికి లాభం ఏముంటుంది?" అని ప్రశ్నించారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసం ఒకవేళ సినిమా కావాలనే లీక్ చేశారని అనుకున్నా.. ఆ విషయం కొన్ని గంటల్లోనే లేదా కొన్ని రోజుల్లోనే విచారణలో బయటపడేదని వినోద్ చెప్పారు. చట్టసంస్థలు అలాంటి అంశాలను వెంటనే గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయని పేర్కొన్నారు. లీక్ జరిగిన సమయంలో విజయ్ ముఖ్యమంత్రి పదవిలో లేరని కూడా వినోద్ గుర్తు చేశారు. అయినప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టి ఆరోపణలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని అన్నారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. విజయ్ ఎందుకు స్పందించలేదు? సినిమా లీక్ వ్యవహారం పూర్తిగా చట్టపరమైన అంశమని వినోద్ స్పష్టం చేశారు. నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ ప్రారంభమైందని, అదే సరైన మార్గమని అన్నారు. విజయ్ ఇందులో జోక్యం చేసుకుంటే అసలు అంశం పక్కదారి పట్టే అవకాశం ఉండేదని చెప్పారు. మొదట ఈ సినిమాను 2026 జనవరిలో విడుదల చేయాలని భావించారని వినోద్ వెల్లడించారు. అయితే అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడటంతో దాదాపు ఆరు నెలల పాటు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ కాలం తమకు ఎంతో బాధాకరంగా గడిచిందని గుర్తు చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. అలాగే.. 'జన నాయగన్', 'భగవంత్ కేసరి'కథను ఆధారంగా తీసుకుందనే ప్రచారంపై కూడా వినోద్ గతంలో క్లారిటీ ఇచ్చారు. ఒరిజినల్ సినిమాలోని కొన్ని అంశాలను మాత్రమే తీసుకున్నామని, దాన్ని రాజకీయ కోణంలో మరింత విస్తృతంగా మలిచామని తెలిపారు. ఇది పూర్తిస్థాయి రీమేక్ కాదన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్' పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో అన్న ఉత్కంఠ తమిళ సినీ వర్గాల్లో నెలకొంది.
సినిమా లీక్ అయిన తర్వాత దాదాపు కోటి మంది ఆ లీక్ వెర్షన్ చూశారని ప్రచారం జరిగినా.. విజయ్ ఎందుకు ప్రజలకు విజ్ఞప్తి చేయలేదన్న ప్రశ్నకు కూడా వినోద్ సమాధానం ఇచ్చారు. "విజయ్ స్పందించి లీక్ వెర్షన్ చూడొద్దని చెప్పినా మరో రకమైన విమర్శలు వచ్చేవి. దేశంలో రైతుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడని వ్యక్తి ఇప్పుడు సినిమా కోసం మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పేవారు. అందుకే ఆయన ఈ విషయంలో దూరంగా ఉండటం మంచిదని భావించారు" అని వినోద్ వివరించారు.More Articles