అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నటవారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. అపజయాలకు, అవమానాలకు 'లెనిన్' సినిమాతో సాలిడ్ సమాధానం ఇచ్చారు. భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ జోష్‌లో ఉన్నారు. సినిమా విజయానంతరం వరుస ప్రమోషనల్ కార్యక్రమాలు, టెలివిజన్ షోలలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి జీ తెలుగు ప్రసారమవుతున్న 'డ్రామా జూనియర్స్ సీజన్-9' సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement

సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న 'డ్రామా జూనియర్స్' షోకు మంచి ఆదరణ అందుకుంటుంది. ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌లో కొనసాగుతోంది. ఈ సీజన్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ నటి రోజా, హీరో శ్రీకాంత్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. బోనాల స్పెషల్ ఎపిసోడ్‌గా రాబోతున్న ఈ కార్యక్రమంలో అఖిల్-భాగ్యశ్రీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

స్టేజ్‌పైకి వచ్చిన అఖిల్‌కు సుడిగాలి సుధీర్ ప్రత్యేక స్వాగతం పలికారు. వచ్చి రాగానే .. 'సిసింద్రీ' సినిమాలో అఖిల్ ఫొటోను చూపిస్తూ, 'కనబడుతున్న చిన్నపిల్లవాడిని స్పూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ వారందరికి కంటే చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ అయ్యాడు" అంటూ సరదాగా ఆటపట్టించారు. అఖిల్ స్పందిస్తూ.. "'లెనిన్' సినిమా కోసం నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ ఈ విజయం సమాధానం ఇచ్చింది" అంటూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి "'సిసింద్రీ'తో చిన్నప్పుడే ఇండస్ట్రీని షేక్ చేశావు" అని ప్రశంసించగా, అఖిల్ వెంటనే "వచ్చే సంక్రాంతికి మనిద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం" అంటూ స్టేజ్‌పైనే ఆఫర్ ఇచ్చారు. దీనికి అనిల్ రావిపూడి కూడా నవ్వుతూ రెండు చేతులు పైకెత్తి 'రెడీ' అని సంకేతం ఇవ్వడంతో అక్కడున్నవారంతా చప్పట్లతో అభినందించారు. ఈ చిన్న సంభాషణ అభిమానుల్లో కొత్త కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచింది.

Advertisement

అనంతరం క్రికెట్‌పై కూడా మాట్లాడుతూ.. "క్రికెట్ గురించి కొంత తెలిసే ఉంటుందని అనుకుంటున్నా" అంటూ సుధీర్ సెటైర్ వేయగా.. "నీకన్నా బాగా తెలుసు" అంటూ అఖిల్ ఇచ్చిన కౌంటర్ స్టేజ్ మొత్తాన్ని నవ్వుల్లో ముంచెత్తింది. 'డ్రామా జూనియర్స్ ప్రీమియర్ లీగ్' పేరుతో ఏర్పాటు చేసిన సరదా క్రికెట్ గేమ్‌లో అఖిల్ బ్యాటింగ్ చేస్తూ, సుధీర్ ఫీల్డింగ్ పొజిషన్ మార్చమని చెప్పడం కూడా ప్రేక్షకులను బాగా అలరించింది.

Advertisement

ఇక ప్రోమోలో మరో ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. 'పెద్ది' సినిమా పోస్టర్‌ను చూపించగానే "ఆర్‌సీ నా హార్ట్ బీట్" అంటూ రామ్ చరణ్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే సమంత నటించిన 'మా ఇంటి బంగారం' పోస్టర్‌ను చూపించగా.. "సమంత ఫీమేల్ పవర్‌ను చూపించింది" అంటూ ప్రశంసించారు. 'లెనిన్' పోస్టర్‌ను చూపించగానే.. అనిల్ రావిపూడి "అఖిల్ గారే నంబర్ వన్" అని చెప్పడం కూడా అభిమానులను ఆకట్టుకుంది.

'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నాగార్జునతో కలిసి భావోద్వేగానికి గురైన వీడియో గురించి కూడా అఖిల్ స్పందించారు. "ఆ క్షణం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. నేను మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ బాధను, ఆ ఎదురుచూపులను అనుభవించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన విజయం రావడంతో ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాం" అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.