Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో వరుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. పెద్ద డెకరేషన్ కాంట్రాక్ట్ పూర్తి చేయడానికి డబ్బుల అవసరంతో మీనా ఫైనాన్షియర్ సింగరాజును ఆశ్రయిస్తుంది. తాను కష్టపడి సంపాదించే వ్యక్తినని, జూదం ఆడే అలవాటు లేదని, రూపాయి పెట్టి రూపాయి లాభం సంపాదించే వ్యాపారినని చెబుతూ 9 లక్షల అప్పు అడుగుతుంది. ఆమె నిజాయితీని గుర్తించిన సింగరాజు, "ఇచ్చేటప్పుడు దేవుడిలా కనిపిస్తా.. వసూల్ చేసుకునేటప్పుడు మాత్రం రాక్షసుడిలా మారొద్దని" చెప్పమని మీనా కోరగా, అతడు 9 లక్షలు అప్పుగా ఇస్తాడు. అయితే అక్కడ ఉన్న కుటుంబ ఫొటో ద్వారా సింగరాజు చింతామణి భర్తేనని ప్రేక్షకులకు తెలుస్తుంది.

Advertisement

ఆ డబ్బుతో మీనా డెకరేషన్ పనిని అద్భుతంగా పూర్తి చేస్తుంది. పనిని చూసిన కస్టమర్లు ప్రశంసలు కురిపిస్తారు. వీడియో కాల్‌లో బాలు కూడా ఆమెను మెచ్చుకుంటూ, ముందుగా అప్పు తీర్చేయాలని సూచిస్తాడు. ఇద్దరి మధ్య జరిగిన సరదా ఫోన్ సంభాషణ, మీనా సిగ్గుపడుతూ ఫోన్‌లో ముద్దు పెట్టడం ఎపిసోడ్‌కు క్యూట్ టచ్ ఇచ్చింది. ఇదిలా ఉండగా, మీనా చేసిన అద్భుతమైన డెకరేషన్‌ను చూసిన చింతామణి తీవ్ర అసూయతో రగిలిపోతుంది. తన అసిస్టెంట్ ముందు మీనాను వ్యాపారం మానేసేలా చేస్తానని శపథం చేస్తుంది.

Advertisement

Courtesy: jiohotstar

మరోవైపు, డబ్బులు తీసుకోవడానికి మేనేజర్ వద్దకు వెళ్లిన మీనాకు ఊహించని షాక్ ఎదురవుతుంది. మిగిలిన 9 లక్షలు అడగగా, "ఏ డబ్బులు?" అంటూ మేనేజర్ ప్లేటు మార్చేస్తాడు. అంతేకాదు, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చినట్లు అగ్రిమెంట్ చూపించి, మీనా సంతకం కూడా ఉందని చెబుతాడు. ఐదు సున్నాలు మాత్రమే ఉన్న పేపర్‌పై తనతో తొందరపెట్టి సంతకం పెట్టించారని మీనా ఎంత వేడుకున్నా ఎవరూ నమ్మరు. చివరకు ఆమెను అవమానించి బయటకు పంపేస్తారు.

ఈ కుట్ర వెనుక చింతామణే ఉందని తర్వాత స్పష్టమవుతుంది. మేనేజర్ తీసుకొచ్చిన 9 లక్షలను ప్రస్తుతం అలాగే ఉంచమని చింతామణి చెప్పడంతో ఆమె పన్నాగం బయటపడుతుంది. అంతేకాదు, మీనా వ్యాపారం ముగిసిపోయిందని ప్రభావతికి ఫోన్ చేసి చెప్పడంతో, ప్రభావతి ఆనందంతో పండుగ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఈ వ్యవహారంపై శ్రుతికి అనుమానం రావడం కథలో మరో మలుపుగా మారింది.

Advertisement

చివర్లో మీనా నేరుగా ఓనర్‌ను కలిసి జరిగిన మోసం గురించి వివరించగా, మేనేజర్ మళ్లీ అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. "డబ్బులు తీసుకుని వాడేసి ఉంటారు.. లేదంటే ఆమె భర్త తాగేసి ఉంటాడు" అని బాలు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో మీనా తీవ్ర ఆగ్రహానికి గురవుతుంది. ఈ ఘర్షణతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగియగా, మీనాకు న్యాయం జరుగుతుందా? చింతామణి కుట్ర ఎలా బయటపడుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
చింతామణి కుట్ర బట్టబయలు.. సీసీటీవీతో బయటపడిన నిజం..

రాబోయే ఎపిసోడ్‌లో ఊహించిన ములుపులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చింతామణి తన ప్లాన్‌లో భాగంగా ఫంక్షన్ హాల్ మేనేజర్‌ను తన వైపు తిప్పుకుని, మీనాకు రావాల్సిన 9 లక్షలు కాజేయించిన విషయం తెలిసిందే. కేవలం లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి పని చేయించుకుని, తర్వాత డాక్యుమెంట్‌లో మార్పులు చేసి మొత్తం 10 లక్షలు చెల్లించినట్లు నకిలీ అగ్రిమెంట్ తయారు చేస్తారు. అదే డాక్యుమెంట్‌ను చూపిస్తూ మేనేజర్, ఫంక్షన్ హాల్ ఓనర్‌ను కూడా నమ్మిస్తాడు. దీంతో మీనా ఎంత వేడుకున్నా ఆమె మాటలను ఎవరూ పట్టించుకోరు. పైగా ఆమెనే తప్పు చేసినట్టుగా మాట్లాడి తీవ్రంగా అవమానిస్తారు. చేసేదేమీ లేక కన్నీళ్లతో మీనా ఇంటికి తిరిగి వస్తుంది.

Advertisement

మరోవైపు మీనా మోసపోయిందన్న విషయం తెలుసుకున్న ప్రభావతి మాత్రం పైశాచిక ఆనందంలో మునిగిపోతుంది. వెంటనే రవికి ఫోన్ చేసి హోటల్‌లోని తనకు ఇష్టమైన వంటకాలు అన్నీ తీసుకురమ్మని చెబుతుంది. "ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.. పండుగ చేసుకోవాలి" అంటూ సంబరపడుతుంది. అయితే తల్లి ప్రవర్తన రవికి వింతగా అనిపిస్తుంది. శృతి కూడా "ఎవరో బాధపడితేనే అత్తయ్య ఇలా సంతోషపడుతుంది.. ఖచ్చితంగా బాలు, మీనాకు ఏదో జరిగింది" అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంట్లో ప్రభావతి హడావుడిని చూసిన సత్యం కూడా "ఎవరి కొంపో కూల్చి ఉంటుందేమో" అని అనుకుంటాడు.

Advertisement

ఇంతలో బాధతో ఇంటికి చేరుకున్న మీనాను చూసినా ప్రభావతి ఏమీ తెలియనట్లు నటిస్తూ ఇంటి పనులు చేయమని వేధిస్తుంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీనా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె కళ్లలోని బాధను గమనించిన శృతి వెంటనే గదిలోకి వెళ్లి అసలు విషయం అడుగుతుంది. అప్పుడు జరిగిన మోసం మొత్తం మీనా కన్నీళ్లతో వివరిస్తుంది. ఆమె మాటలు విన్న శృతి, ఈ అన్యాయాన్ని వదిలిపెట్టొద్దని ధైర్యం చెప్పి వెంటనే ఫంక్షన్ హాల్‌కు తీసుకెళ్తుంది.

ఫంక్షన్ హాల్ ఓనర్ ఎదుట శృతి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. మీనా వ్యక్తిత్వం, నిజాయితీ, కష్టపడి ఎదిగిన తీరు గురించి వివరంగా చెబుతుంది. మొదట నమ్మని ఓనర్, శృతి మాటలతో కాస్త ఆలోచనలో పడతాడు. వెంటనే ఆ రోజు జరిగిన వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి పరిశీలిస్తాడు. అందులో మీనాతో మొదట కేవలం లక్ష రూపాయలకే ఒప్పందం చేసిన విషయం, ఆ తర్వాత చింతామణి రావడం, డాక్యుమెంట్లలో మార్పులు చేయించడం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో మీనాపై జరిగిన మోసం పూర్తిగా బయటపడుతుంది. అసలు నిజం తెలుసుకున్న ఓనర్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. "నీకు జరిగిన అన్యాయం నేను సరిదిద్దుతాను. నీ డబ్బు నీకు తప్పకుండా వచ్చేలా చూస్తాను" అని మీనాకు మాట ఇస్తాడు. మరుసటి రోజు రావాలని చెప్పి పంపిస్తాడు. దీంతో శృతి కూడా మీనాకు ధైర్యం చెబుతూ, నిజం ఎప్పటికైనా గెలుస్తుందని నమ్మకం కల్పిస్తుంది.

Advertisement

మరుసటి రోజు ఓనర్ మేనేజర్‌ను తన ఛాంబర్‌కు పిలిపించి గట్టిగా నిలదీస్తాడు. "నిజం ఒప్పుకుంటావా.. లేక పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపాలా?" అని హెచ్చరిస్తాడు. దీంతో భయపడిపోయిన మేనేజర్ చివరకు జరిగిన కుట్ర మొత్తం బయటపెడతాడు. చింతామణి డబ్బు ఆశ చూపించి తనతో డాక్యుమెంట్లు మార్చించిందని, 9 లక్షలు దాచిపెట్టమని చెప్పిందని అంగీకరిస్తాడు. వెంటనే ఓనర్ చింతామణికి ఫోన్ చేసి అర్జెంట్‌గా ఫంక్షన్ హాల్‌కు రావాలని ఆదేశిస్తాడు. అక్కడికి వచ్చిన చింతామణి పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. అయినా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ సీసీటీవీ ఆధారాలు, మేనేజర్ ఒప్పుకోవడంతో ఆమె మాటలకు విలువ లేకుండా పోతుంది. చింతామణిపై ఓనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "నీలాంటి వాళ్ల వల్ల మా సంస్థ పేరు చెడిపోతుంది. నిన్ను, మేనేజర్‌ను ఇద్దరినీ పోలీసులకు అప్పగించడానికి కూడా నేను సిద్ధమే" అని హెచ్చరిస్తాడు.

జైలు భయం పట్టుకోవడంతో చింతామణి చివరకు దిగివస్తుంది. ఓనర్ చెప్పినట్టుగా మీనా ముందు చేతులు జోడించి క్షమాపణ చెబుతుంది. అంతేకాదు, కాజేసిన 9 లక్షల మొత్తాన్ని తిరిగి మీనాకు ఇచ్చేస్తుంది. అయితే ఓనర్ ఈ విషయాన్ని అక్కడితో వదిలేయడు. మేనేజర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తూ, ఇకపై చింతామణికి తమ ఫంక్షన్ హాల్ నుంచి ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వబోమని స్పష్టం చేస్తాడు. ఇక నుంచి అన్ని డెకరేషన్ ఆర్డర్లకు మీనాకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని ప్రకటిస్తాడు. ఇలా మీనాను మోసం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూసిన చింతామణికే చివరకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. మీనా నిజాయితీకి న్యాయం జరగడంతో పాటు, ఆమె వ్యాపారానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. ఈ పరిణామాలతో రాబోయే ఎపిసోడ్లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.