తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలకుపైగా పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రావణ సంధ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. కెరీర్‌లో ఎదురైన ఒడిదుడుకులు, తనకు వచ్చిన అవకాశాలు, మిస్ అయిన పాత్రలు, పారితోషికం కంటే పాత్రలకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పిన ఆమె.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, నటుడు-దర్శకుడు జేడీ చక్రవర్తి తన నటనను ప్రశంసించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Advertisement

శ్రావణ సంధ్య మాట్లాడుతూ.. తాను మోడల్‌గా, డ్యాన్సర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పారు. చిన్నా, పెద్దా కలిపి వందలాది సినిమాల్లో నటించినప్పటికీ, నటిగా తనకు అసలైన గుర్తింపును తీసుకొచ్చింది మాత్రం 'గమ్యం' సినిమానే అని వెల్లడించారు. ఆ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషించిన తర్వాత తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయని చెప్పారు. పారితోషికం కంటే ఒక నటిగా తన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోవడమే తనకు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

Advertisement

'గమ్యం' విడుదలైన కొంతకాలానికే 7 అప్ కమర్షియల్ యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్లినట్లు శ్రావణ సంధ్య తెలిపారు. ఆ ప్రకటనలో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని చెప్పారు. షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ సరదాగా తనతో మాట్లాడేవారని, అప్పట్లో తాను చేసిన సినిమాల గురించి అడిగారని గుర్తు చేసుకున్నారు. తాను 'గమ్యం'లో నక్సలైట్ పాత్ర చేశానని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారని అన్నారు.

Advertisement

అప్పుడు అల్లు అర్జున్ తనతో చెప్పిన మాటలను శ్రావణ సంధ్య ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. "మీరు గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్ర చేశారా? నేను ఆ సినిమా చూసినప్పుడు నిజంగానే ఓ నక్సలైట్‌ను తీసుకొచ్చి నటింపజేశారా అని అనుకున్నాను. అంత సహజంగా ఆ పాత్రలో జీవించారు" అని అల్లు అర్జున్ తనను అభినందించారని వెల్లడించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదుగుతున్న దశలో ఉన్నప్పటికీ, ఆయనలాంటి నటుడు తన నటనను మెచ్చుకోవడం జీవితంలో మరచిపోలేని సంఘటనగా నిలిచిపోయిందని చెప్పారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పదేపదే పంచుకున్నానని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

Advertisement

అల్లు అర్జున్ తనను ప్రశంసించిన సమయంలో నేటిలా మొబైల్ కెమెరాలు, సోషల్ మీడియా లేకపోవడం ఒకింత బాధగా అనిపించిందని శ్రావణ సంధ్య అన్నారు. "ఆ రోజు నా ఆనందాన్ని ఎవరూ వీడియో తీసి ఉండి ఉంటే బాగుండేది. ఆయన చెప్పిన మాటలు, నా ఎక్స్‌ప్రెషన్స్ రికార్డ్ అయి ఉండి ఉంటే జీవితాంతం దాచుకునేదాన్ని" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చిన విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఒక చిన్న పాత్ర కోసం దాదాపు 48 మంది నటీనటులను పరిశీలించిన తర్వాత తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆడిషన్‌లో తన నటన చూసిన జేడీ చక్రవర్తి వెంటనే తననే ఆ పాత్రకు ఎంపిక చేశారని, "ఈ పాత్ర మీరే చేయాలి" అని చెప్పడం తనలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. అల్లు అర్జున్ తన నటనను మెచ్చుకున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో.. ఇన్ని సంవత్సరాల తర్వాత జేడీ చక్రవర్తి నుంచి వచ్చిన ప్రశంస కూడా అంతే సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.

Advertisement

తన కెరీర్‌లో 'గమ్యం','వేదం','గోలీమార్','లెజెండ్','శశిరేఖా పరిణయం','కృష్ణం వందే జగద్గురుం','జాంబీ రెడ్డి' వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం బాధ కలిగిస్తుందని శ్రావణ సంధ్య చెప్పారు. పారితోషికం ఎంత అన్నది తనకు ముఖ్యమేమీ కాదని, పాత్రకు ప్రాధాన్యం ఉంటే తక్కువ రెమ్యునరేషన్‌కైనా నటించేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ మాత్రమే కాదు,'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన నటనను అభినందించారని శ్రావణ సంధ్య వెల్లడించారు. అయితే ఆ సన్నివేశం చివరికి ఎడిటింగ్‌లో తొలగించబడిందని చెప్పారు.

Advertisement

ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తన ప్రయాణంలో స్టార్ హీరోలు, దర్శకుల నుంచి వచ్చిన ప్రశంసలే తనకు పెద్ద అవార్డులని శ్రావణ సంధ్య అన్నారు. ఒక నటుడు మరో నటుడి పనిని నిజాయితీగా గుర్తించి అభినందించడం ఎంతో విలువైన విషయమని పేర్కొన్నారు. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా పరవాలేదని, మంచి పాత్రలు చేస్తూ నటిగా ప్రేక్షకుల గుర్తింపును నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.