తెలుగు బుల్లితెర చరిత్రలో కామెడీ షోలకు కొత్త నిర్వచనం చెప్పిన కార్యక్రమం 'జబర్దస్త్'. దాదాపు 12 ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తూ టాప్ కామెడీ షోగా కొనసాగుతోంది. వేలాది మంది కళాకారులకు జీవితాన్ని అందించింది ఈ షో. గుర్తింపు లేని ఎంతో మంది కమెడియన్లను స్టార్‌లుగా మార్చింది. సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈ షో ఇప్పుడు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు గ్రాండ్‌గా స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలో కామెడీతో పాటు ఎమోషనల్ క్షణాలు కూడా ప్రేక్షకులను కదిలించాయి. ముఖ్యంగా యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్ స్టేజ్‌పైనే ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Advertisement
Advertisement

జబర్దస్త్ ప్రయాణం ప్రారంభమైన రోజుల్లో చిన్న చిన్న అవకాశాల కోసం ఎంతో మంది కళాకారులు ఎదురుచూశారు. ఈ షో వల్ల స్టార్ కమెడియన్లుగా ఎదిగారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్, అదిరే అభి, చలాకీ చంటి, రాఘవ, రాకెట్ రాఘవ వంటి ఎన్నో మంది ఈ వేదిక ద్వారానే పాపులరిటీ సొంతం చేసుకున్నారు. వారిలో కొందరు ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుండగా, మరికొందరు హీరోలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒకప్పుడు జీవనోపాధి కోసం కష్టపడిన కళాకారులు నేడు సెలబ్రెటీలుగా మారారు.

Advertisement

జబర్థస్త్ తన 12 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాత, కొత్త కమెడియన్లు, టీమ్ లీడర్లు, యాంకర్లు అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గురు-శిష్య సంబంధాన్ని గుర్తు చేసే ప్రత్యేక సెగ్మెంట్‌ను ఏర్పాటు చేశారు. జబర్దస్త్‌లో సీనియర్ల వద్ద నేర్చుకుని ఎదిగిన జూనియర్లు, తమ గురువుల పట్ల కృతజ్ఞతగా వారి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సన్నివేశం స్టేజ్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటగా అదిరే అభి కాళ్లు కడిగి హైపర్ ఆది తన గురుభక్తిని చాటుకున్నాడు. అనంతరం చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, రాఘవ వంటి సీనియర్ కళాకారుల కాళ్లు కూడా వారి శిష్యులు కడిగి గౌరవం తెలిపారు. ఈ సీన్స్ వారిని భావోద్వేగానికి గురిచేశాయి.

Advertisement

ఇక ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణ యాంకర్ అనసూయ రీఎంట్రీ. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపై అడుగుపెట్టిన అనసూయకు ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో అనసూయ మాట్లాడుతూ.. "నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నటిగా ఎంతో కష్టపడుతున్నాను. సినిమాల్లో మంచి పాత్రలు చేస్తున్నాను. నా నటనతో కొత్త గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఈ జన్మకు మాత్రం నేను జబర్దస్త్ అనసూయగానే గుర్తుండిపోతాను. అదే నాకు వచ్చిన అతిపెద్ద గుర్తింపు" అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.

Advertisement

ఆ తరువాత అసలు ఎమోషనల్ సీన్ చోటుచేసుకుంది. అనసూయ ఒక్కసారిగా రష్మీ గౌతమ్ వైపు నడుచుకుంటూ వెళ్లింది. "జీవితంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. నేను ఒకరితో ప్యాచ్‌అప్ కావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈరోజు అదే చేస్తున్నాను" అంటూ చెప్పి రష్మీని హత్తుకుంది. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనతో రష్మీ కూడా ఎమోషనల్ అయింది. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపు అక్కడున్న వారంతా కూడా సైలెంట్ అయ్యారు. ఆ క్షణం మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.

Advertisement

హగ్ అనంతరం అనసూయ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయేలా ఉన్నాయి. ఇకపై మనిద్దరం మళ్లీ కలిసిపోయామని కొత్త కొత్త కామెంట్లు వస్తాయి" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. అయితే వెంటనే రష్మీ కూడా నవ్వుతూ స్పందించింది. "ఇదంతా స్టేజ్ మీద చేయాల్సిన అవసరం ఏముంది? వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపినా... లేదా ఒక ఫోన్ కాల్ చేసినా ఇదంతా అయిపోయేది కదా" అనగా.. దానికి అనసూయ కూడా అంతే సరదాగా, "అలా చేయాలంటే చాలా ఈగోలు అడ్డొస్తాయి. అందరి ముందు చెప్పేస్తే మనసులో ఉన్నది పూర్తిగా బయటపడుతుంది కదా" అంటూ సమాధానం ఇచ్చింది. ఈ మాటలు విన్న వారంతా చప్పట్లతో వారిని అభినందించారు.

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత కొంతకాలంగా అనసూయ, రష్మీ మధ్య విభేదాలున్నాయా? అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ స్వయంగా "ప్యాచ్‌అప్ కావాలి" అని చెప్పడం, రష్మీని హగ్ చేసుకోవడం, ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన తర్వాత అభిమానులు అసలు వీరి మధ్య ఏం జరిగింది? ఎందుకు దూరమయ్యారు? ఇప్పుడు ఎలా కలిశారు? అనే విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. "అనసూయ-రష్మీ మధ్య గొడవ ఏమిటి?" అని తెగ సెర్చ్ చేస్తున్నారు.