బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ఖాన్.. 61 ఏళ్ల వయసులో ఇటీవల మూడోసారి పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకున్నారు. జూలై 5న ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ముంబై బాంద్రాలోని తన నివాసంలో మొదటి, రెండో భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఆమీర్ఖాన్- గౌరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత భార్యతో ఎలా జీవితం సాగించాలన్న దానిపైనా ఆమీర్ ఖాన్ ముందే ప్లానింగ్తో ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమీర్ఖాన్కు తొలుత 1986లో నటి రీనా దత్తాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు జునైద్, కుమార్త ఐరా సంతానం. 16 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించుతూ 2002లో ఆమీర్ - రీనాలు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2005లో కిరణ్ రావును ఆమీర్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2011లో ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. అయితే ఆమెతోనూ ఆమీర్ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. 2021లో కిరణ్- ఆమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నారు.
కిరణ్ రావుతో విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగానే ఉన్న ఆమీర్ ఖాన్.. అనంతరం 2025లో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. అయితే గౌరికి అంతకుముందే కునాల్ స్ప్రాట్తో 2010లో వివాహం జరిగింది. ఈ దంపతులకు క్వీన్ స్ప్రాట్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే 2023లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆమీర్తో గౌరికి 25 ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఆమీర్ ఖాన్ విడాకుల తర్వాత కూడా తన మాజీ భార్యలతో స్నేహంగానే ఉంటున్నారు. మాజీ భార్యల సమక్షంలోనే తన మూడో పెళ్లి జరుపుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అయితే విడాకులు ఎందుకు జరిగాయన్న దానిపై పలుమార్లు ఆమీర్ ఖాన్ స్పందించారు. ఈ పరిణామాలకు ప్రధాన కారణం తానేనని.. కెరీర్, సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి భార్యాబిడ్డలకు, కుటుంబానికి సమయం కేటాయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నా మాజీ భార్యలతో అనుబంధం కొనసాగుతోందని.. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పారు. ఇదిలాఉండగా గౌరీ స్ప్రాట్తో పెళ్లి తర్వాత ఆమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. కుటుంబం మొత్తం ఒకేచోట నివసించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ విల్లాను ఆయన నిర్మిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన పాలి హిల్లో ఉన్న బెల్లా విస్టా, మెరీనా అపార్ట్మెంట్లను ఈ మిస్టర్ పర్ఫెక్ట్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లుగా బీటౌన్ టాక్. ఈ రెండు భవనాలను కూల్చేసి అన్నిరకాల సదుపాయాలతో అత్యాధునికమైన స్కై విల్లాను నిర్మించాలని ఆమీర్ భావిస్తున్నారు. ఈ కాంప్లెక్స్లో ఆమీర్ కుటుంబంలోని అన్ని తరాల సభ్యులు కలిసి నివసించనున్నారు. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. ఆమీర్ తల్లి జీనత్ హుస్సేన్, సోదరీమణులు ఫర్ఖాన్ ఖాన్ దత్తా, నిబత్ ఖాన్.. కిరణ్ రావు ఆమె కుమారుడు ఆజాద్లు ఇందులోనే నివసించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రీనా దత్తాకు తనకు కలిగిన పెద్ద కుమారుడు జునైద్ కోసం కూడా ఒక అంతస్తును ఆమీర్ కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమీర్ ఖాన్ తన భార్య గౌరీ స్ప్రాట్, ఆమె కుమారుడు క్విన్తో కలిసి ఒక అంతస్తులో నివసించనున్నారట. ఇందులో కుటుంబ సభ్యులకు కావాల్సిన స్విమ్మింగ్ పూల్స్, పార్క్, ఆట స్ధలం, థియేటర్తో పాటు కుటుంబ సమావేశాలు, వేడుకలు నిర్వహించుకునేందుకు ఒక అంతస్తును పూర్తిగా కేటాయించనున్నారని బీటౌన్ టాక్. ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు తన భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాలి హిల్లోని నర్గీస్ దత్ రోడ్లో ఉన్న విల్నోమోనా అపార్ట్మెంట్స్లో తాత్కాలికంగా నివసించనున్నారు. నిర్మాణం ముగిసిన వెంటనే ఈ స్కై విల్లాలో గృహ ప్రవేశం చేయనున్నారట ఆమీర్ ఖాన్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.More Articles