సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే సినిమాలు, పాటలు కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. చిత్ర పరిశ్రమతో పాటు సమాజంలో మహిళలకు జరిగే అన్యాయాలపై ఆమె గళమెత్తుతుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తను చెప్పాలనుకున్నది చెప్పడంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు. సోషల్ మీడియాలో చిన్మయి స్పందించే తీరుపై కొందరు ట్రోలింగ్కు దిగుతుంటారు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తికి చిన్మయి శ్రీపాద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
బాంబేలో స్థిరపడిన తెలుగు సంగీత కుటుంబంలో జన్మించిన చిన్మయి.. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్గా ఎన్నో హిట్ పాటలు పాడిన ఆమె.. భూమిక, కంగనా రనౌత్, కాజల్, తమన్నా, త్రిష, సమంత, తాప్సీ, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, మృణాల్ ఠాకూర్, కాయదు లోహర్ తదితర హీరోయిన్లకు పలు భాషలలో డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా సమంతకు ఆమె వాయిస్ బాగా పేరు తీసుకొచ్చింది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ప్రేమలో పడిన చిన్మయి... 2014లో ఆయనను పెళ్లాడారు. ఈ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారు.
అయితే దీనిపైనా ట్రోలింగ్ జరగ్గా ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నిత్యం ఏదో ఒక టాపిక్ గురించి చిన్మయి స్పందించడం దానిపై ట్రోలింగ్ జరగడంతో ఆమె విసిగిపోయారు. ఇటీవల తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్స్ పెడుతున్న వారిపై చిన్మయి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ని కలిసి ఫిర్యాదు చేశారు. రోజూ ఈ వేధింపులతో విగిసిపోయాను, మా ఉద్దేశ్యాలు నచ్చకపోతే దానిని పట్టించుకోవద్దు.. అంతేకానీ నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ చిన్మయి మండిపడ్డారు. తాజాగా చిన్మయి శ్రీపాదకి 4 అబార్షన్స్ అయ్యాయి, ఈవిడ నీతులు చెబుతోందంటూ ఆమెను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ పెట్టాడు. దీనిపై సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నెటిజన్ ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. నా గర్భాశయం, సంతానోత్పత్తి సామర్ధ్యం గురించి విపరీతమైన ఆసక్తితో, సోషల్ మీడియాలో మహిళలను నిరంతరాయంగా వేధించేలా పెరిగిన తెలుగు యువకులారా అంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు చిన్మయి. రెబల్ కార్తీక్.. నువ్వు ఏమైనా అనుకో. అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీలాంటి మురికిలో బతికేవాళ్లు ఇచ్చే సర్టిఫికెట్స్ తీసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. అనవసరంగా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు నీ మీద కేసు నమోదైతే.. నువ్వు, నీ కుటుంబంతో కలిసి 20 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఉన్నదల్లా మురికి నోరు మాత్రమే. తెలంగాణ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, మమ్మల్ని ఆ కార్యక్రమాలకి ఆహ్వానించినా సరే.. ఇక్కడ వేధింపులు, ప్రజల మనస్తత్వం దేశంలోనే దారుణంగా ఉన్నాయి. ఇక్కడ భద్రత లేదు, తగిన చర్యలు లేవు.. ఈ వేధింపులకు పాల్పడేవారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారికి నరకం, ఘోరమైన కష్టాలు కలగాలని కోరుకుంటున్నాను, వారి మనస్తత్వం మాదిరిగానే, వారి జీవితం కూడా తయారవ్వాలని చిన్మయి శాపనార్ధాలు పెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పలువురు ప్రముఖులు, నెటిజన్లు చిన్మయికి అండగా నిలుస్తున్నారు. More Articles