లెజెండరీ సింగర్ ఎస్ జానకి మరణంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఆరు దశాబ్ధాల పాటు తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించిన జానకమ్మ.. తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆమె మరణంపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సహా ప్రజలు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

ఎస్ జానకి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. దక్షిణ భారత గానకోకిల, ప్రముఖ నేపథ్య గాయని జానకమ్మ గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. తెలుగు గడ్డపై పుట్టిన ఆమె.. 6 దశాబ్ధాలకు పైగా సాటిలేని సంగీత వారసత్వాన్ని నిర్మించి తన కాలాతీతమైన స్వరంతో తరతరాలను స్పృశించారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన అపారమైన సేవ ఎప్పటికీ చిరస్మరణీయం. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా హృదయపూర్వక సంతాపమని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు... ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.

జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం అంటూ మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు.

Advertisement

తన మధురమైన స్వరంతో తరతరాల ప్రజలను పలకరించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పోస్ట్ పెట్టారు.

ఆమెది చిరకాలం నిలిచిపోయే స్వరం. ఆ స్వరం మూగబోయినప్పటికీ, ఆమె రాగాలు అనంతకాలం పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పద్మభూషణ్ శ్రీమతి ఎస్ జానకి గారు సాటిలేని సంగీత వారసత్వాన్ని మనకు అందించారు. దాదాపు 7 దశాబ్ధాల ఆమె సుదీర్ఘ కెరీర్‌లో, 17కు పైగా భారతీయ, అంతర్జాతీయ భాషలలో 48 వేలకు పైగా పాటలను ఆలపించి తరతరాల శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. 4 జాతీయ చలనచిత్ర పురస్కరాలు, 12 నంది అవార్డులతో పాటు అనేక రాష్ట్ర స్థాయి గౌరవాలను అందుకున్న ఆమె భారతదేశంలోని ప్రసిద్ధ నేపథ్య గాయనీమణులలో ఒకరిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారి తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఓ దైవమాకి తన గాత్రాన్ని అందించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దిగ్గజ గాయని ఎస్ జానకి గారికి హృదయ పూర్వక నివాళులు అర్పిస్తోంది అని పవన్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

Advertisement