అక్కినేని కుటుంబ నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు అఖిల్ అక్కినేని. కొండంత ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటకీ ఈ అక్కినేని వారసుడికి ఇప్పటివరకు భారీ కమర్షియల్ బ్రేక్ లేదు. భారీ విజయం కోసం అఖిల్ ఎదురుచూస్తూనే ఉన్నాడు. చిన్నతనంలోనే 'సిసింద్రీ'తో బాలనటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అఖిల్.. 'మనం'సినిమాలో క్యామియో పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక'అఖిల్' సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్ను' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైన సక్సెస్ను అందుకోలేకపోయారు. ఆ తరువాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కొంతవరకు ఊరటనిచ్చినా.. 'ఏజెంట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అఖిల్ కెరీర్పై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణాన్ని కొత్త మలుపు తిప్పుతుందని 'లెనిన్'సినిమాతో రానున్నారు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ట్రైలర్లో కనిపించిన యాక్షన్, ఎమోషన్స్, మేకింగ్ క్వాలిటీ ఈసారి అఖిల్కు బ్లాక్బస్టర్ దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు కేవలం 12 గంటలు మాత్రమే మిగిలి ఉండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారింది. అఖిల్ ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు ఎంత కష్టపడ్డాడో అభిమానులకు వివరించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "గత రెండేళ్లుగా అఖిల్ ఈ సినిమా కోసం తన రక్తం, చెమట, ప్రాణం పెట్టి పనిచేశాడు. చాలా కాలం తర్వాత తన కెరీర్లో మరో పెద్ద బ్రేక్థ్రూ అవుతుందనే నమ్మకంతో ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాను చేశాడు. మా 'సిసింద్రీ' మీ ముందుకు రావడానికి ఇంకొన్ని గంటలే మిగిలాయి" అంటూ నాగవంశీ ట్వీట్లో పేర్కొన్నారు. అభిమానులను ఉద్దేశించి ఆయన మరింత భావోద్వేగంగా స్పందించారు. "మీరందరూ థియేటర్లకు వచ్చి అఖిల్ను మీ ప్రేమతో ఆశీర్వదించండి. సినిమాకు గొప్ప ఓపెనింగ్ ఇవ్వండి. మీ నుంచి వచ్చే ఆదరణ అతనికి మరింత ఆత్మవిశ్వాసాన్ని, ఇంకా కష్టపడాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది" అని కోరారు. అలాగే అఖిల్పై వస్తున్న విమర్శలకు పరోక్షంగా సమాధానం ఇస్తూ నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈసారి అతను గోల్డెన్ స్పూన్తో పుట్టిన స్టార్ కిడ్గా మీ ముందుకు రావడం లేదు. తన సత్తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో వచ్చిన కొత్త హీరోలా మీ ముందుకు వస్తున్నాడు. ఇది కొత్త అఖిల్.. అఖిల్ 2.0" అని పేర్కొన్నారు. చివరగా "ఈసారి ప్రేక్షకులు పూర్తి సంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వస్తారని మా టీమ్ హామీ ఇస్తోంది" అని నాగవంశీ ట్వీట్లో వెల్లడించారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నో ఆశలతో వస్తున్న 'లెనిన్' అఖిల్ కెరీర్కు నిజంగానే టర్నింగ్ పాయింట్ అవుతుందా? 'అఖిల్ 2.0'గా ఆయన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. More Articles