ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు టాలీవుడ్కు పరిచయం కానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జయకృష్ణ చెప్పిన విషయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అలాగే.. మహేష్ బాబు చెప్పిన సలహా తన జీవితాన్నే మార్చిందని చెప్పారు. ఇంతకీ హీరో జయకృష్ణకు మహేష్ బాబు ఏం చెప్పారంటే?
రెండేళ్లు విదేశాల్లో నటన శిక్షణ
హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు జయకృష్ణ అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న ప్రముఖ లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో రెండేళ్ల పాటు నటనలో శిక్షణ పొందారు. అక్కడ పలు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకున్నారు. నటనలో పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే టాలీవుడ్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కేవలం యాక్టింగ్తో సరిపెట్టుకోకుండా ఫిజికల్ ఫిట్నెస్పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. గత పదేళ్లుగా టేక్వాండో, కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్లో కఠినంగా శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్, ముంబైలో డాన్స్ కూడా నేర్చుకుని కమర్షియల్ హీరోకు అవసరమైన అన్ని అంశాల్లో సిద్ధమయ్యారు.
మహేష్ బాబు చెప్పిన సలహా రమేష్ బాబు మరణం తర్వాత.. మోహన్ బాబుతో
పరిశ్రమలోకి వచ్చే క్రమంలో బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన సలహాలు తన కెరీర్ కు మార్గదర్శకంగా మారాయని జయకృష్ణ తెలిపారు. "సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని ఎవరూ చూడరు" అని తనకు మహేష్ బాబు చెప్పారని, అందుకే 100 శాతం ఫోకస్తో, ప్రాపర్ ప్రిపరేషన్తో మాత్రమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సూచించారని అన్నారు. ఆ మాటలను తాను చాలా సీరియస్గా తీసుకున్నానని చెప్పారు. అందుకే తొందరపడకుండా ప్రతి విషయంలో శిక్షణ తీసుకుని, పూర్తిగా సిద్ధమైన తర్వాతే హీరోగా వస్తున్నానని వెల్లడించారు. ఈ సినిమా తనకు కేవలం హీరోగా పరిచయం మాత్రమే కాదని, తమ కుటుంబం పదేళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరిన క్షణమని జయకృష్ణ చెప్పారు. హీరో కావడానికి ఎంతో కాలం కష్టపడ్డానని, తొందరపడి ఇండస్ట్రీలోకి రాలేదని తెలిపారు.
2022లో తండ్రి రమేష్ బాబు మరణం తన జీవితంలో పెద్ద లోటు అని జయకృష్ణ అన్నారు. ఆ సమయంలో తాత సూపర్ స్టార్ కృష్ణ తనకు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లాలని, ఆయన చెప్పిన మాటలే తనకు బలం ఇచ్చాయని అన్నారు. 'శ్రీనివాస మంగాపురం' సినిమాని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 93 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాలు, పులిగుండు కొండలు వంటి సహజ ప్రదేశాల్లోనే షూటింగ్ జరిపారని వెల్లడించారు. ఎలాంటి భారీ సెట్లు వేయకుండా సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు నటించినట్లు చెప్పారు. తమ మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ప్రేక్షకులను అవి తప్పకుండా కదిలిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమాలోని ఆరు పాటలు కథకు బలంగా నిలుస్తాయని జయకృష్ణ తెలిపారు. ప్రస్తుతం చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. కానీ జయకృష్ణ మాత్రం సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ వినియోగానికి కూడా చాలా వరకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. నటనపై మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.More Articles