అక్షయ్ కుమార్ ది గ్రేట్: మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించిన సూపర్స్టార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాటం చేస్తున్న ముంబై పోలీసులకు అండగా నిలిచారు. ఇప్పటికే పలుమార్లు ఆర్థిక సహాయం, విరాళాలు ప్రకటించిన అక్షయ్ మరోసారి పోలీసుల ఆరోగ్యంపై దృష్టిపెట్టి హెల్త్ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు కొవిడ్ 19 లక్షణాలను గుర్తించే హెల్త్ బ్యాండ్లను అందించారు. దీంతో తమ సమీపంలో కరోనావైరస్ బారిన పడిన వ్యక్తులను సులభంగా గుర్తించడానికి వీలు కలుగుతుంది.
మహారాష్ట్రను కరోనా అతలాకుతలం చేస్తున్న సమయంలో ముంబై పోలీసులకు 1000 రిస్ట్ బ్యాండ్లను అందజేశారు. దీంతో ముంబై పోలీసులు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొనేందుకు అక్షయ్ దోహదపడ్డారు. ఇలా కరోనాను గుర్తించే వెసులుబాటు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని పోలీసులకు కూడా చేపట్టలేదు. ఇలా కొవిడ్ను గుర్తించే పనిలో భాగమైన తొలి ఉద్యోగులుగా ముంబై పోలీసులు ఓ ఘనతను సొంతం చేసుకోబోతున్నారు.

కోరోనావైరస్ ముప్పు మొదలనప్పటి నుంచి అక్షయ్ కుమార్ పలు సమయాల్లో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రధాని నిధికి ఆయన రూ.25 కోట్ల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా బొంబాయి మున్సిపాలిటీకి పలు కార్యక్రమాలకు విరాళం ప్రకటించారు. ఇటీవల కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు,మెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులకు స్పూర్తిని కలిగించేందుకు తేరి మిట్టి: ట్రిబ్యూట్ అనే ఆల్బమ్లో నటించారు.
దేశం కోసం అక్షయ్ కుమార్ స్పందించడం ఇదే మొదటిసారి కాదు. పలు సందర్భాల్లో అక్షయ్ ప్రభుత్వాలకు అండగా నిలిచారు. తాజాగా అక్షయ్ కుమార్ స్పందిస్తున్న తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications











