మన దేశంలో అక్షయ్ ఒక్కడే హీరోనా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్లో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అక్షయ్ కుమార్. కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తూ మంచి హీరో అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనూ వసూళ్లలోనూ టాప్ హీరోలతో పోటీ పడుతూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇదంతా అక్షయ్ ఒకవైపు మాత్రమే.. అతడి రెండో వైపు నిజమైన హీరో ఉన్నాడు. అవును.. అక్షయ్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.
ఇప్పటికే పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ... దానికి తన వంతు సాయం చేస్తూనే ఉంటున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. కొద్దిరోజుల క్రితం భారతదేశంలోనే సంచలనం రేకెత్తించిన పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సైనికుల సహాయార్థం రూ. 5 కోట్ల విరాళం ప్రకటించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఒక వివాహా కార్యక్రమంలో పాల్గొన్నఅక్షయ్ కుమార్.. అక్కడ పెళ్లి చేసుకున్న ఒక్కో యువతికి లక్షల రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతులు మీదుగా అందించారు.

దీని తర్వాత.. ఫోని తుఫాను ధాటికి ఒడిశాలోని కొంత ప్రాంతం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావం తగ్గి నెలలు గడుస్తున్నా ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాను సమయంలోనూ అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నాడు. తుఫాను సహాయార్ధం తనవంతుగా రూ. 1 కోటి రూపాయల విరాళాన్ని ఒడిశా సీఎం సహానిధికి పంపించారు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది.
తాజాగా అతడు మరోసారి దాతృత్వాన్ని నిరూపించుకున్నాడు. కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులన్నీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో జన జీవనం స్థంభించింది. ఇప్పుడు వీరికి సహాయం అందించడానికే అక్షయ్ ముందుకొచ్చాడు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. అలాగే, కజిరంగా జాతీయ ఉద్యానవన సంరక్షణకు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు, అందరూ విరాళాలు అందజేయాలని ట్విట్టర్ వేదికగా కోరాడు. దీంతో అక్షయ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో మన దేశంలో అక్షయ్ ఒక్కడే హీరోనా అంటూ మిగిలిన నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











