Raksha Bandhan టీమ్ హైదరాబాద్లో హల్చల్.. చార్మినార్ వద్ద హంగామా!
బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం రక్షాబంధన్. ఈ సినిమాకు సంబంధించిన చిత్ర బృందం, తమ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలు నగరాలలో సందడి చేస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా బృందం హైదరాబాద్ నగరాన్ని సందర్శించింది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈ చిత్ర బృందం దుబాయ్, పూణే, ఇండోర్లో సందడి చేసింది. ఈ బృందంలో అక్షయ్కుమార్, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్, నటీనటులు సాడియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్, సహేజ్మీన్ కౌర్, దీపికా ఖన్నాలు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఇండోర్ పర్యటన తరువాత, ఈ చిత్ర బృందం హైదరాబాద్కు వచ్చింది. పీవీఆర్ (సినీ మ్యాక్స్)లో మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు అనంతరం చార్మినార్ వద్ద సందడి చేశారు. హైదరాబాద్కు తలమానికమైన చార్మినార్ వద్ద ఫోటోలనూ దిగారు. తమ అభిమాన సూపర్స్టార్ తో పాటుగా చిత్ర బృందాన్ని దగ్గరగా చూసేందుకు, వారితో ముచ్చటించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రక్షాబంధన్ చిత్రానికి నిర్మాణ బాధ్యతలను జీ స్టూడియోస్తో కలిసి ఆనంద్ ఎల్ రాయ్ మరియు హిమాంశు శర్మ, అల్కా హిరానందానీ, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ తీసుకున్నాయి. హిమాంశు శర్మ మరియు కనికా ధిల్లాన్ రచన చేయగా, రక్షాబంధన్కు హిమేష్ రేష్మియా సంగీత దర్శకత్వం అందించారు. ఈ చిత్రంలోని పాటలకు సాహిత్యాన్ని ఇర్షాద్ కమిల్ అందించారు.

రక్షా బంధన్ చిత్రంలో భూమి పద్నేకర్, అక్షయ్కుమార్, నీరజ్ సూద్, సీమా పహ్వా, సాదియా ఖతీబ్, అభిలాష్ థపిల్యాల్, దీపికా ఖన్నా, స్మృతి శ్రీకాంత్ మరియు సహెజ్మీన్ కౌర్లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 11, 2022 తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











