వివాదంలో దురంధర్ స్టార్.. దృశ్యం నిర్మాత నోటీసులు జారీ ..
బాలీవుడ్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల సూపర్ హిట్ మూవీ 'ఛావా'లో ఔరంగజేబు పాత్రలో ఆయన చూపిన విలనిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాత్రతో తెలుగు ఆడియన్స్లోనూ అక్షయ్ ఖన్నాకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రేజ్ కొనసాగుతూనే, తాజాగా విడుదలైన స్పై థ్రిల్లర్ 'ధురంధర్'లో కూడా నెగటివ్ షేడ్ పాత్రలో మెప్పించి, పాన్ ఇండియా రేంజ్లో ఫేమ్ను సొంతం చేసుకున్నారు. ఇలాంటి క్రేజీ టైమ్లో అక్షయ్ ఖన్నా చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే? స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిట్ ఫ్రాంచైజీ 'దృశ్యం' సిరీస్కు సంబంధించిన వివాదం. ఇప్పటికే 'దృశ్యం', 'దృశ్యం 2'తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్న ఈ ఫ్రాంచైజీకి మూడో భాగంగా 'దృశ్యం 3'తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'దృశ్యం 2'లో అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర కథలో కీలకంగా ఉండటంతో, 'దృశ్యం 3'లో కూడా ఆయనే నటిస్తారని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిర్మాత కుమార్ మంగత్ పాఠక్తో అక్షయ్ ఖన్నాతో ఒప్పందం కూడా పూర్తయిందని సమాచారం.

ఈ ఒప్పందంలో భాగంగా అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ అమౌంట్ కూడా చెల్లించినట్లు నిర్మాత వెల్లడించారు. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందు అక్షయ్ ఖన్నా అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు టెక్ట్స్ మెసేజ్ పంపడంతో వ్యవహారం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ విషయంపై నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్షయ్ ఖన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల షూటింగ్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.
భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఫ్రాంచైజీ కావడంతో ప్లానింగ్ మొత్తం అక్షయ్ ఖన్నా పాత్ర చుట్టూనే సాగిందని, అతడు మధ్యలో తప్పుకోవడంతో ఆర్థిక నష్టం ఎదురవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన కింద అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపినట్లు నిర్మాత స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా, అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్ను ఎంపిక చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో 'దృశ్యం 3' షూటింగ్ను ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు అక్షయ్ ఖన్నా లేదా ఆయన టీమ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఈ వివాదానికి మరో కోణం కూడా ఉందనీ టాక్.. ' ధురంధర్' సక్సెస్ తర్వాత అక్షయ్ ఖన్నా తన రెమ్యునరేషన్ను భారీగా పెంచారని, దాదాపు రూ. 22 కోట్ల వరకు డిమాండ్ చేశారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, కొన్ని ప్రత్యేక కండీషన్లు కూడా పెట్టినట్టు టాక్. ఈ డిమాండ్లే నిర్మాతలకు భారంగా మారి, చివరకు ఈ వివాదానికి దారి తీసినట్టు సమాచారం. ఈ క్రమంలో నిర్మాత మంగత్ పాఠక్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. 'అక్షయ్ ఖన్నాకు అవకాశాలు లేని సమయంలోనే నేను సెక్షన్ 375 సినిమా ఇచ్చాను. ఆ సినిమా తర్వాతే అతనికి గుర్తింపు వచ్చింది. దృశ్యం 2 తర్వాత అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ధురంధర్ హిట్కు తానే కారణమని అక్షయ్ భావిస్తున్నాడు. కానీ ఆ సినిమా విజయంలో రణ్వీర్ సింగ్ పాత్ర ఎక్కువ' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
మొత్తానికి, ధురంధర్ హిట్ తో కెరీర్ పీక్లో ఉన్న సమయంలో అక్షయ్ ఖన్నా ఎదుర్కొంటున్న ఈ లీగల్ ఇష్యూ బాలీవుడ్లో సంచలనంగా మారింది. హిట్ ఫ్రాంచైజీ అయిన దృశ్యం 3 చుట్టూ నెలకొన్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, అక్షయ్ ఖన్నా నుంచి వచ్చే స్పందన ఏమిటో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











