అమీషా పటేల్కు చేదు అనుభవం.. భయంకరం, కాళరాత్రి, ప్రాణాలు అరచేతిలో అంటూ..
బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టాలీవుడ్, బాలీవుడ్ నటి అమీషా పటేల్ బెదిరింపులకు, బ్లాక్మెయిల్కు గురయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎల్జేపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లగా ఆమె చేదు అనుభవాన్ని చవిచూసింది. తాను ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి అమీషాను బెదిరించడం చర్చనీయాంశమైంది. అయితే అమీషా పటేల్ చేసిన ఆరోపణలు ఎల్జీపీ నేత ఖండించడంతో ఈ అంశం వివాదంగా మారింది. ఈ వివాదానికి సంబంధించిన ఆడియో టేప్ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. అమీషా చేసిన ఆరోపణలు ఏమిటంటే..

బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం
బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ తరఫున ప్రకాశ్ చంద్ర అనే అభ్యర్థి కోసం అమీషా పటేల్ ప్రచారం చేపట్టింది. అయితే ప్రచారంలో తనతో ఆయన దురుసుగా వ్యవమరించారు. ఓ దశలో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తేడాగా కూడా ప్రవర్తించడంతో నాకు భయం కలిగింది అని అమీషా పటేల్ చెప్పారు.

అనుక్షణం ప్రాణాలు చేతిలో పెట్టుకొని
బీహార్ ఎన్నికల్లో బాగంగా దౌడ్ నగర్ ప్రచారానికి వెళ్లిన సమయంలో అనుక్షణం భయాందోళనలకు గురయ్యాను. ఎప్పుడు ఎవరు రేప్ చేస్తారో.. ఎవరు చంపేస్తారనే అనే భయంతో వణికిపోయాను. నా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకు జీవుడా అంటూ ముంబైకి తిరిగి వచ్చాను అంటూ అమీషా పటేల్ చెప్పినట్టు ఓ ఆడియో టేప్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

సురక్షితంగా బయటపడి ముంబైకి
అమీషా పటేల్ పేర్కొన్నట్టు భావిస్తున్న ఆడియో టేప్లో వెల్లడించిన ప్రకారం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో నా లైఫ్ ముప్పులో పడింది. నా టీమ్ నా వెంట ఉండి కాపాడారు. ఇక మరో అవకాశం లేకపోవడంతో సురక్షితంగా బయటపడి ముంబైకి చేరుకొన్నాను అని ఉంది. ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.

బెదిరింపులు, వేధింపులు
బీహార్ ఎన్నికల ప్రచారం నుంచి ముంబైకి వచ్చిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్నారు. బీహార్ పర్యటన ఓ కాళరాత్రిగా మారింది. దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అని అమీషా పటేల్ తెలిపారు.

అమీషా ఆరోపణల్లో వాస్తవం లేదు
అయితే అమీషా పటేల్ చేసిన ఆరోపణలను ఎల్జేపీ అభ్యర్థి ఓబ్రా ప్రకాశ్ చంద్ర ఖండించారు. ప్రచారంలో ఆమెకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాం. అయితే జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ వద్ద డబ్బు తీసుకొని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నది అని ప్రకాశ్ చంద్ర మండిపడ్డారు.

బద్రితో అమీషా పటేల్ కెరీర్
ఇక అమీషా పటేల్ కెరీర్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ తొలిసారి సినీ పరిశ్రమకు పరిచయమైన కహో నా ప్యార్ హై చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్తో కలిసి బద్రి అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్తో నరసింహుడు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలకే పరిమితమయ్యారు.


Click it and Unblock the Notifications











