బాగా వర్షం పడాలి: ఐసీసీ వన్డే టోర్నీపై అమితాబ్ సంచలన ట్వీట్
ఇండియాలో క్రికెట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వన్డే వరల్డ్ కప్ అంటే దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్లో టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. అయితే ఇటీవల జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
క్రికెట్ అభిమానుల పరిస్థితి అర్థం చేసుకున్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్... ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంటును ఇండియాకు షిప్ట్ చేయాలనే డిమాండ్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజేష్ కేజ్రీవాల్ అనే అభిమాని స్పందిస్తూ... ''ఐసీసీ తీరు చూస్తుంటే సిగ్గుగా ఉంది. ఆర్గనైజింగ్ సరిగా లేదు. ఇంత ముఖ్యమైన టోర్నమెంటు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సగం మ్యాచులు రద్దవుతున్నాయి. సరైన టైమ్లో నిర్వహించండి'' వ్యాఖ్యానించారు.
దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ... ''ఐసీసీ 2019 వరల్డ్ టోర్నమెంట్ ఇండియాకు షిప్ట్ కావాలంటే.... అక్కడ మరింత వర్షం పడాలి'' అంటూ ఫన్నీ కామెంట్ చేశారు. అమితాబ్ చేసిన ఈ కామెంటుకు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.
బిగ్ బి సినిమాల విషయానికొస్తే... ఇటీవలే ఆయన 'చెహ్రే' షూటింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మి, క్రితి కర్బంద ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఝండ్, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ హూ మే, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











