Amitabh Bachchan కీలక నిర్ణయం.. ఆ యాడ్ నుంచి తప్పుకున్న అమితాబ్.. తెలియకే అలా!
బాలీవుడ్ షాహెన్షా అమితాబ్ బచ్చన్ గత కొన్ని రోజులుగా పాన్ మసాలా ప్రకటన విషయంలో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటుడు ఒక పాన్ మసాలా యాడ్ను ప్రమోట్ చేయడం చూసి అభిమానులు మాత్రమే కాక సాధారణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆ మధ్య జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ( నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఏకంగా అమితాబ్ కు లేఖ రాసింది.పాన్ మాసాల ప్రచారాన్ని వదిలేయమని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. పాన్ మసాలా మరియు పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలలో రుజువైందని 'పొగాకు నిర్మూలన కోసం నేషనల్ ఆర్గనైజేషన్' అధ్యక్షుడు శేఖర్ సల్కర్ బిగ్ బికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అమితాబ్ ప్రభుత్వ పల్స్ పోలియో ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నందున, అతను త్వరగా పాన్ మసాలా ప్రకటన ప్రచారాన్ని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
అయితే అమితాబ్ అని కాదు ఎక్కువగా సినిమా హీరోలు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం ఇటీవలి కాలంలో వివాదాస్పదమవుతున్న క్రమంలో అమితాబ్ కీలక నిర్ణయం, తీసుకున్నారని అంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల కమలా పసందు అనే పాన్ మసాలా యాడ్లో నటించారు. తాజాగా పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ నుంచి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తప్పుకున్నారు. పాన్ మసాలా యాడ్లో నటించడం లేదని, ఆ బ్రాండ్ను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు అమితాబ్ వెల్లడించారు.

ఆయన తన బ్లాగ్ ద్వారా వివరణ ఇచ్చారు. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లతో ఎటువంటి సంబంధంలేదని ఆదివారం అమితాబ్ ఆఫీసు ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ సరోగేట్ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని అమితాబ్కు తెలియదని, ఆ విషయం తెలుసుకున్నాక ఆయన తన ప్రమోషన్ను అప్పటికప్పుడు నిలిపివేశారని ఆ బ్రాండ్ను ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేసినట్లు బ్లాగ్లో తెలిపారు. ఇటీవల మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్ కూడా ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. మరి వారికీ తెలుసో లేదో కానీ అది కూడా సరోగేట్ ఎడ్వర్టైజింగ్ కిందనే వస్తుంది. దేశం మొత్తం బ్యాన్ లో ఉన్న పాన్ మసాలాను మౌత్ ఫ్రెషనర్ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై మహేష్ బాబుతో పాటు టైగర్ ష్రాఫ్ పైన విమర్శలు వచ్చినా వారు పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. సదరు సంస్థ విస్తృతంగా ప్రకటనలు జారీ చేస్తూ ఉంది. మరి ఈ విషయంలో వారు కూడా స్పందించకుంటే వారికి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి ఏం జరగనుంది నేడు.


Click it and Unblock the Notifications











