హీరో ఆయుష్మాన్ ఖురానాకు ఇంట్లో తీవ్ర విషాదం.. సెలబ్రిటీలు సంతాపం..!
చిత్ర పరిశ్రమల్లో ఇటీవల విషాదాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఏదో ఒక రకంగా టాప్ సెలబ్రిటీ ఒకరు మరణించడం ఇండస్ట్రీలలో కలకలం రేపుతుంది. ఇప్పటికే తెలుగులో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే. విశ్వనాథ్, గాయనీ వాణి జయరాం తదితర స్టార్ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమల్లో కూడా విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
ఉదయం కన్నుమూత: హిందీలోని అగ్ర హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. తనదైన నటనతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా విక్కీ డోనార్, అంధాదున్ వంటి చిత్రాలతో చాలా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయుష్మాన్ ఖురానా తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి. ఖురానా శుక్రవారం (మే 19) ఉదయం కన్నుమూశారు. దీంతో బాలివుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గుండెపోటుతో: గత కొద్ది రోజులుగా పి. ఖురానా గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. పోర్టీస్ ఆసుపత్రిలో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే మరణంతో పోరాడిన పి. ఖురానా చివరికి శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. పి. ఖురానా మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఆయుష్మాన్ అభిమానులు విచారం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు ప్రకటిస్తూ.. ఆయుష్మాన్ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
ఇద్దరు కుమారులు: కాగా పి. ఖురానాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర్శక్తి ఖురానా కూడా నటుడే. ఇక తన తండ్రి అంటే ఆయుష్మాన్ ఖురానాకు చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎక్కువగా పి. ఖురానా ఫొటోలనే పంచుకుంటూ ఉంటాడు. నటుడు కావాలనే తన కలను తండ్రి సహాకారంతో నిజం చేసుకున్నాడు. పండిత్ వీరేంద్ర ఖురానా ఆస్ట్రాలజర్ గా చాలా పాపులర్ అయ్యారు. ఆయన మాటలను ఎంతోమంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు పాటిస్తారని టాక్ ఉంది. ఆ పరిచయాలతోనే తన ఇద్దరు కొడుకులను పి. ఖురానా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

రకుల్ తో ఆయుష్మాన్: ఇదిలా ఉంటే విక్కీ డోనర్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆయుష్మాన్ ఖురానా. మొదటి చిత్రంతోనే నటుడిగా మెప్పించాడు. అనంతరం విలక్షణ పాత్రలు చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు. అంధాదున్ సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ సైతం అందుకున్నాడు. డ్రీమ్ గర్ల్, బాలా చిత్రాలతో మెప్పించాడు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి డాక్టర్ జీ మూవీ చేశాడు.

సత్కారం.. విషాదం: ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఆయుష్మాన్ ఖురానా. పంజాబ్ యూనివర్సిటీలో ఆయుష్మాన్ కు సత్కారం ఉండగా.. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.ఇక ఆయుష్మాన్ తమ్ముడు అపర్ శక్తి ఖురానా కూడా మంచి నటుడిగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. దంగల్, పతీ పత్నీ ఔర్ వో, బద్రీనాథ్ కి దుల్హానియా, హమ్ దో హమారే దో, జబారియా జోడీ, స్త్రీ వంటి చిత్రాలతో అలరించాడు.


Click it and Unblock the Notifications











