గుండెపోటుతో బాలీవుడ్ నటుడు కన్నుమూత.. షాక్లో ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు
బాలీవుడ్, గుజరాతీ సినిమా పరిశ్రమలో తనదైన ప్రతిభతో గుర్తింపు పొందిన నటుడు అమిత్ మిస్త్రీ ఇకలేరు. శుక్రవారం అంటే ఏప్రిల్ 23వ తేదీన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హిందీలో క్యా కహ్నా, ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్తోపాటు రాజ్, డీకే ద్వయం రూపొందించిన 99, షోర్ ఇన్ ది సిటీ, ఏ జెంటిల్మెన్ చిత్రాల ద్వారా ప్రేక్షకులచే గుర్తింపు పొందారు.
ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ బండీష్ బండిట్స్లో తనదైన ప్రతిభను చాటుకొన్నారు. ఇలా ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడంతో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ విషాద సమయంలో పలువురు తమ సంతాప సందేశాలను సోషల్ మీడియాలో వెల్లడించి.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నారు.

అమిత్ మిస్త్రీ మేనేజర్ మహర్షి దేశాయ్ వెల్లడించిన ప్రకారం.. ఆయన ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొన్నారు. గుండెపోటుకు గురి కావడానికి ముందు ఆయన వర్కవుట్లు, ఎక్సర్సైజ్లు చేశారు. ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదు, మందులు వాడిన దాఖలాలు లేవు. కానీ ఆయన మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది అని అన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో తల్లి ఆయన వెంట ఉన్నారు.
అమిత్ మిస్త్రీతో పలు సినిమాల్లో పనిచేసిన డైరెక్టర్లు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది.. మేము మంచి నటుడిని కోల్పోయాం అంటూ సంతాపంలో తెలిపారు. 99 సినిమాలో కుబర్గా, షోర్ ఇన్ ది సిటీలో టిప్పుగా, ఏ జెంటిల్మెన్లో జిగ్నేష్గా ప్రస్తుత సిరీస్లో ప్రఖండ్ పండిట్గా అద్బుతమైన నటనను ప్రదర్శించారు. ఆయన కోసం శ్రద్దగా పాత్రలను రాసే వాళ్లం. ఆయన మరణంతో గుండె ముక్కలైంది అని రాజ్, డీకే తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











