చీటింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్.. నిర్మాత ఫిర్యాదుతో భార్యతో సహా జైలుకు..
చీటింగ్ కేసులో బాలీవుడ్ నటుడు ప్రశాంత్ నారాయణ్ అరెస్ట్ అయ్యాడు. నిర్మాత ఫిర్యాదు మేరకు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులు అతడిని జుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

నిర్మాత ఫిర్యాదుతో
కేరళ పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రశాంత్ నారాయణ్ను చీటింగ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం నిజమే. నిర్మాత థామస్ ఫిర్యాదు చేశాడు. 2017లో నారాయణ్ మలయాళ సినిమాలో నటించాడు. ఆ సమయంలో నిర్మాతకు దగ్గరయ్యాడు. ఈ సమయంలో తన భార్యకు ముంబైలో కంపెనీ ఉంది. ఒకవేళ అందులో పెట్టుబడి పెడితే కంపెనీకి డైరెక్టర్ను చేస్తానని చెప్పాడు. దాంతో నిర్మాత 1.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత సదరు నిర్మాత మోసపోయానని గ్రహించాడు. దాంతో మాకు ఫిర్యాదు చేశారు అని తెలిపారు.

తప్పించుకొని తిరుగుతూ
ఫిర్యాదు నేపథ్యంలో తప్పించుకొని నారాయణ్ తిరుగుతుండటంతో ముంబైలో ఏడుగురు సభ్యులతో కూడిన కేరళ పోలీసులు నిఘా పన్నారు. ఆ తర్వాత వల పన్ని నారాయణ్, అతడి భార్య షోనాను అరెస్ట్ చేశారు. ముంబై నుంచి ట్రాన్సిట్ వారెంట్పై కేరళకు తరలించారు. ఈ క్రమంలో థలస్సెరీ అడిషినల్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సెప్టెంబర్ 20 వరకు జుడిషియల్ కస్టడికి తరలించారు.

బాలీవుడ్లోకి
నటుడు ప్రశాంత్ నారాయణ్ వ్యక్తిగత జీవితం, కెరీర్ విషయానికి వస్తే.. ఆయన ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత థియేటర్ రంగంలోకి ప్రవేశించాడు. 90వ దశకం ఆరంభంలో ముంబైకి చేరుకొని నటుడిగా స్థిరపడ్డారు. నటుడు ప్రశాంత్ నారాయణ్ మర్డర్ 2 చిత్రం ద్వారా ప్రజాదరణ పొందారు. ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తనను చీటింగ్ చేశారని నిర్మాత థామస్ పనిక్కర్ ఫిర్యాదుచేయడంతో కష్టాల్లో పడ్డారు.

50కుపైగా చిత్రాల్లో
ఇప్పటి వరకు దక్షిణాది, హిందీ సినీ రంగంలో ప్రశాంత్ నారాయణ్ 50 చిత్రాల్లో నటించాడు. షాడో ఆఫ్ టైమ్, మర్డర్ 2, వైసా బీ హోతా హై పార్ట్ 2, పీఎం నరేంద్రమోదీ చిత్రాల్లో కీలక పాత్రలను పోషించాడు. పలు చిత్రాల్లో నారాయణ్ నటనకు మంచి ఆదరణ లభించింది.


Click it and Unblock the Notifications











