‘‘ థియేటర్లు అన్నీ ఖాళీ .. అవన్నీ ఫేక్ కలెక్షన్సే, జనాన్ని వెర్రోళ్లని చేసి’’
గతంలో ఓ సినిమా 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు ఆడితే బొమ్మ బ్లాక్బస్టర్ అనేవాళ్లు. కాలమాన పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు ఆ పరిస్ధితులు మారిపోయాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్, రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్స్ని బట్టి సినిమా బాగా ఆడినట్లు లెక్క. వసూళ్లని బట్టి హీరోల రేంజ్ని నిర్దేశించే స్థాయికి సినిమా దిగజారిపోయింది. థియేటర్లో ఎన్ని రోజులు బొమ్మ పడింది అన్నది లెక్క కాదు.. ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది అన్నదే ప్రధానంగా మారిపోయింది. దీంతో కొన్ని సినిమాలు ఫేక్ కలెక్షన్స్ని ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్పై సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత భూషణ్ కుమార్ సతీమణి దివ్య ఖోస్లా. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్లో కలెక్షన్స్ని ఓ మాఫియా శాసిస్తూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కొందరు హీరోలను రక్షిస్తూ.. వారిపై పోటీకి వచ్చే సినిమాల అంతు చూసే వరకు వదిలిపెట్టదు. అక్కడ కార్పోరేట్ బుకింగ్ అనే ఆయుధాన్ని వాడుతుంటారు. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కానుకగా టికెట్లను ఇస్తూ ఉంటాయి కంపెనీలు. ఇందుకోసం బల్క్ బుకింగ్స్ చేస్తారు. దీనిని అస్త్రంగా వాడి కలెక్షన్స్ని ఆమాంతం పెంచేస్తుంది ఈ మాఫియా.

ఉదాహరణకు ఒక్కో టికెట్ ధర రూ.100 ఉంటే.. వీళ్లు దానికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించి బుక్ చేస్తారు. దీని కారణంగా వసూళ్లు భారీగా పెరిగిపోతాయి. ఇవి దొంగ కలెక్షన్సేనని పలువురు సినీ ప్రముఖులు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు హీరోలు, నిర్మాతలు ఈ కార్పోరేట్ బుకింగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రత్యర్ధి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు కూడా.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ లేటెస్ట్ మూవీ.. జిగ్రా దసరా కానుకగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను అలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమేశ్ మిశ్రాలు నిర్మించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చెప్పుకోదగ్గ తారాగణం లేదు. ఈ మూవీని అలియా తన భుజాన వేసుకుని నడిపించారు. అన్ని భాషల్లోనూ ఆమె స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సినిమా రెండు రోజుల్లో ఇండియా వైడ్గా రూ.11.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్లోగా పికప్ అవుతుందని ట్రేడ్ పండితులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే జిగ్రా మూవీకి వస్తున్న కలెక్షన్స్పై టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సతీమణి , నటి దివ్య ఖోస్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జిగ్రాను చూసేందుకు వెళ్లానని .. థియేటర్ మొత్తం ఖాళీగా ఉందని, కానీ కలెక్షన్స్ ఎక్కడి నునంచి వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ఫేక్ వసూళ్లను ప్రకటిస్తున్న అలియా భట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలని.. జనాన్ని వెర్రివాళ్లను చేయొద్దని దివ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అలియా భట్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











