చనిపోయానని మా అమ్మకి ఫోన్ .. సంచలన విషయాన్ని బయటపెట్టిన స్టార్ హీరోయిన్
గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ రంగంలో ఆడ, మగ కాస్త క్లోజ్గా ఉంటే చాలు పుకారు రాయుళ్లు రెచ్చిపోతుంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తారలపై ఉన్నది లేనిది కల్పించి రాసి వారి జీవితాన్ని రోడ్డు మీదకు ఈడ్చిన ఘటనలు ఎన్నో. నేటి సోషల్ మీడియా యుగంలో ఎన్నో వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్. వీటిలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్ధితి. వ్యూస్ కోసం షాకింగ్ థంబ్నెయిల్స్, టైటిల్స్తో పోస్టర్స్ వదలడంతో ఎంతో మంది తారలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తన జీవితంలో జరిగిన ఘటనను పంచుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. ఈ వివరాల్లోకి వెళితే
భారతీయ చిత్ర పరిశ్రమలో కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1974 ఆగస్ట్ 5న మహారాష్ట్రలో జన్మించిన కాజోల్ అనతికాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అందం , అభినయంతో ఆమె ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ముఖ్యంగా మెస్మరైజ్ చేసే ఆమె నవ్వుకు ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. కెరీర్ పరంగా ఆమె తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కారణంగా కాజోల్తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకాడేవారు.

1992లో బేఖుది మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆమె వయసు 17 ఏళ్లే . కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా బాజీగర్తో ఆమె తొలి హిట్ అందుకున్నారు. షారుఖ్ ఖాన్తో కలిసి నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగేతో కాజోల్ భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా నిలిచారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
గూండారాజ్ సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ సూపర్స్టార్ అజయ్ దేవగణ్తో ప్రేమలో పడిన కాజోల్ ఆయనను పెళ్లాడారు. ఈ జంటకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమాలతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న కాజోల్.. అజయ్ దేవగణ్ ప్రొడక్షన్ హౌస్లో భాగస్వామి కూడా. 50 ప్లస్లోనూ చెక్కు చెదరని గ్లామర్తో దూసుకెళ్తున్న ఆమె తాజాగా దో పత్తి అనే సినిమాలో నటించారు. ఇందులో కాజోల్ ద్విపాత్రాభినయం చేశారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నిర్మించారు. షహీరా షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 25 నుంచి దో పత్తి అందుబాటులోకి వచ్చింది.

ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా 'ది కపిల్ శర్మ ' షోలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా మీ దృష్టికి వచ్చిన వెరైటీ వార్తలు ఏమైనా ఉన్నాయా? అని కపిల్ అడగ్గా.. చాలా సార్లు తాను చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయని కాజోల్ తెలిపారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లో ఓ రోజున అజ్ఞాత వ్యక్తి మా అమ్మకి ఫోన్ చేసి.. ఫ్లైట్ యాక్సిడెంట్లో నేను చనిపోయినట్లుగా చెప్పడంతో ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారని ఆమె చెప్పారు. ప్రతి ఐదేళ్లకొకసారి తాను చనిపోయినట్లుగా ఆన్లైన్లో వార్తలు వస్తుంటాయని , ఎప్పుడైనా ఇలాంటి వార్తలు కనిపిస్తే తన మిత్రులు పంపిస్తుంటారని కాజోల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











