హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త కన్నుమూత.. మృతికి కారణం షాకింగ్!
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సినీ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇంగ్లాండ్లో పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకోగా.. దేశ పారిశ్రామిక రంగం షాక్కు గురైంది. పలువురు ప్రముఖులు సంజయ్ కపూర్ మరణం పట్ల సంతాపం తెలిపారు.
భారతీయ ఆటోమొబైల్ రంగానికి సంజయ్ కపూర్ సుపరిచితులు. సోనా కామ్స్టార్ అనే సంస్తకు సంజయ్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీలో ఈ సంస్థ దేశంలో అగ్రగామిగా ఉంది. అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ సంజయ్ కపూర్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. వ్యాపారంతో పాటు క్రీడలంటే సంజయ్కు ఎంతో ఇష్టం. ముఖ్యంగా పోలో ఆటోను ఆయన ఎంతో ప్రేమించేవారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పలు పోలో పోటీలలో చురుగ్గా పాల్గొనేవారు. ఆరియస్ అనే పేరుతో సొంతంగా పోలో జట్టు కూడా సంజయ్ కపూర్కు ఉండేది.

బాలీవుడ్లోనే బలమైన నేపథ్యం ఉన్న కపూర్ కుటుంబ వారసురాలు, అప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ను సంజయ్ కపూర్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే అనివార్య కారణాలతో సంజయ్ - కరిష్మాలు 2014లో వివాహం చేసుకున్నారు. అనంతరం మోడల్, నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. అయితే కొద్దిరోజుల క్రితం సంజయ్పై కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నా మాజీ భర్త నన్ను వేలం వేశాడని.. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో రాత్రి గడపాలని అన్నాడని ఆమె వ్యాఖ్యానించారు. నాతో పెళ్లయిన తర్వాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడని.. దీనిపై ప్రశ్నిస్తే నా మీదే దాడి చేశాడని కరిష్మ తెలిపారు. సంజయ్ తల్లి కూడా వేధింపులకు గురిచేసేదని.. దీంతో అత్తింటి వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నానని కరిష్మా కపూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఇకపోతే.. సంజయ్ కపూర్ తన మరణానికి కొన్ని గంటల ముందు అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం తనను కలిచి వేసిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సంజయ్ తన సోషల్ మీడియాలో పెట్టిన చివరి పోస్ట్ ఇదే కావడం ఆ వెంటనే ఆయన కూడా ప్రాణాలు కోల్పోవడంతో సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 12న ఇంగ్లాండ్లోని గార్డ్స్ పోలో క్లబ్లో పోలో మ్యాచ్ ఆడుతున్న సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ఒక తేనేటీగ లేదా చిన్న పురుగు ఆయన నోటిలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దానిని బయటకు తీసుకురావాలని సంజయ్ ఎంతగానో ప్రయత్నించారు. ఆ సమయంలో తీవ్రమైన అలర్జీ రియాక్షన్కు గురైన ఆయనకు ఊపిరి ఆడలేదు. తీవ్ర భయాందోళనకు గురికావడంతో ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే ఆటను నిలిపివేసి.. వైద్య సహాయం అందించి సంజయ్ను బతికించేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో సంజయ్ కపూర్ మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











