మరో సినీ కీచకుడి అరెస్ట్.. ఔత్సాహిక హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్.. నెట్లో పెడుతానని.. బ్లాక్ మెయిల్!
సినిమా ఆఫర్లను ఎరవేసి దుశ్చర్యలకు పాల్పడుతున్న బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ వ్యవహారాన్ని ముంబై పోలీసులు గుట్టురట్టు చేశారు. ఔత్సాహిక హీరోయిన్లను, పలువురు యువతులను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై సిద్ధార్థ్ సరోడ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా అతడి రాసక్రీడలు, లైంగిక వేధింపులు ఒక్కొక్కటి వెలుగు చూశాయి. పోలీసులు వెల్లడించిన వాస్తవాలు ప్రతీ ఒక్కరిని షాక్ గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...

ఔత్సాహిక హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్
ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల ప్రకారం.. సినిమా బలహీనత ఉన్న అమ్మాయిలను ఫేస్బుక్, వాట్సప్ ద్వారా క్యాస్టింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఎరవేసేవాడు. ఆఫర్ల కోసం ప్రయత్నించే వారి నుంచి ఫొటోలు తీసుకొనేవాడు. ఆ తర్వాత వాటిని మొబైల్ యాప్స్ ద్వారా మార్ఫింగ్ చేసి వారిని నగ్నంగా మార్చేవాడు. అనంతరం వారిని బెదిరించేవాడు అని తెలిపారు.

బెదిరిస్తూ డబ్బు లాగేందుకు ప్రయత్నం
తన బెదిరింపులకు లొంగని వారికి మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలు పంపుతూ బ్లాక్ మెయిల్ చేసే వాడు. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు లాగడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే.. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్టు చేస్తానని బెదిరించేవాడు. దాదాపు ఎనిమిది మంది మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు అని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి
సినీ వేషాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది మహిళల నుంచి వేల నుంచి లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ బాధితురాలు మమల్ని సంప్రదించి ఫిర్యాదు చేసింది. తొలుత నిందితుడి ఆచూకీ లభ్యం కాలేదు. 12 రోజులపాటు మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి పట్టుకొన్నాం అని ముంబై పోలీస్ అధికారి ఆషా కోర్కే తెలిపారు.

బాంద్రా పోలీసుల పక్కా ప్లాన్ వేసి
సిద్ధార్థ్ డబ్బు డిమాండ్ చేస్తున్న ఓ బాధితురాలిని తన వద్దకు పంపాం. తను సినిమా ఆఫర్ ఎలాగైనా ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ అతడి వద్దకు వెళ్లింది. ఆమె నుంచి నేరుగా డబ్బులు తీసుకొంటుండగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడిని గుర్తించి అరెస్ట్ చేశాం. తొలుత అతడు బిజీగా ఉన్నానని తప్పించుకొనేందుకు చూశాడు. దంబాంగ్ హీరోను కలుసుకోవడానికి వెళ్తున్నానని నమ్మించాడు. బాధితురాలు రూ.50 వేలు ఇస్తానని చెప్పడంతో ఆమె వద్దకు వచ్చాడు అని పోలీసులు వెల్లడించారు.

పలు నగరాల యువతులపై వల
బాధితుల ఫిర్యాదు మేరకు మహేష్ దేశాయ్ అనే అధికారి తన బృందంతో రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ రచించి నిందితుడిని బయటకు వచ్చేలా చేశాడు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత వెర్సోవా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తదుపరి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముంబైలోనే కాకుండా థానే, పూణే నగరాలకు చెందిన యువతులను కూడా మోసగించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.


Click it and Unblock the Notifications