ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్సే(67) బుధవారం ముంబైలో మరణించారు. "శ్యామ్ రామ్సే కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు, ఉదయం 5 గంటలకు కన్నుమూశారు "అని మేనల్లుడు అమిత్ రామ్సే బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. శ్యామ్ రామ్సే అంత్యక్రియలు ఈ రోజు విల్లే పార్లే శ్మశానవాటికలో జరుగనున్నాయి.
80, 90ల్లో హిందీలో హారర్ జోనర్ సినిమాలకు మార్గదర్శకులుగా పరిగణించబడుతున్న రామ్సే బ్రదర్స్.... పురాణ మందిర్, వీరానా, దో గాజ్ జమీన్ కే నీచే, బ్యాండ్ దర్వాజా, పురాణి హవేలి, అంధేరా, సబూత్ వంటి చిత్రాలను రూపొందించారు. వారు నిర్మించిన చివరి చిత్రం 2017లో వచ్చిన కోయి హై.

రామ్సే బ్రదర్స్ తులసి, కుమార్, శ్యామ్, కేశు, అర్జున్, గంగూ, కిరణ్ రూపొందించిన చిత్రాలు ఈ నాటికీ గొప్ప కీర్తిని కలిగి ఉన్నాయి. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రసారమైన జీ హర్రర్ షోకు శ్యామ్, అతడి సోదరుడు తులసి రామ్సే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు.
తులసి డిసెంబర్ 2018 లో మరణించారు. హర్రర్, ఎరోటిక్ అంశాలను కలగలిపి తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందించడం ద్వారా రామ్ సే సోదరులు పాపులర్ అయ్యారు. దశాబ్దాల పాటు వినోదరంగంలో రాణించిన వీరు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











