క్షమాపణలు చెప్పిన ఏక్తా కపూర్... కంగనాపై కొనసాగనున్న బహిష్కరణ!
'జడ్జిమెంటల్ హై క్యా' మూవీకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంటులో... హీరోయిన్ కంగనా రనౌత్ ఓ జర్నలిస్టుతో గొడవ పడటం, ఆమె తీరుపై మీడియా వారంతా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వెంటనే కంగనాతో పాటు చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సినిమా కవరేజ్ బహిష్కరిస్తామని ఫిల్మ్ జర్నలిస్టులు హెచ్చరించారు.
ఈ వివాదం మరింత పెద్దగా మారితే తన సినిమాకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో నిర్మాత ఏక్తా కపూర్ స్పందించారు. తమ సినిమా ప్రమోషన్లో ఇలాంటి గొడవ జరుగడం విచారకరమని, అందుకు తాము క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు.

మాకు సంబంధం లేని అంశంపై జరిగిన వివాదం తమ సినిమా ప్రెస్ మీట్లో జరిగిందని, కంగనా రనౌత్ వ్యాఖ్యలు పూర్తిగా ఆవిడ వ్యక్తిగతమని ఏక్తా కపూర్ తన ప్రెస్ నోట్లో చెప్పుకొచ్చారు. ఆ వివాదం కారణంగా మీడియా వారితో తమ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ రిలేషన్ దెబ్బ తినకూడదు, అందుకే క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
ఏక్తాకపూర్ విడుదల చేసిన లేఖతో.... జర్నలిస్టులు శాంతించారు. 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాతో కానీ, ఇతర యాక్టర్లతో తమకు ఎలాంటి గొడవ లేదని, యదావిధిగా తమ కవరేజ్ కొనసాగిస్తామన్నారు. అయితే కంగనా రనౌత్ క్షమాపణలు చెప్పే వరకు ఆమెకు సంబంధించిన కార్యక్రమాలు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో.... ఓ జర్నలిస్ట్ కంగనా నటించిన 'మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' మూవీ ప్రస్తావన తేవడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ''మణికర్ణిక విషయంలో నేను ఏం తప్పు చేశాను? జాతీయత గురించి సినిమాతీయడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడిన సంగతి తెలిసిందే. కంగనా తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించింది అంటూ మీడియా ప్రతినిధులంతా ఆందోళన చేపట్టారు.
కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జడ్జిమెంట్ హై క్యా'. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, ఆయన భార్య కనికా థిల్లాన్ కథ అందించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. జులై 26న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.


Click it and Unblock the Notifications











