షూటింగ్ కోసం పురాతన కట్టడాలను నాశనం చేశారు.. స్టార్ హీరోకు నోటీసులు!
Recommended Video

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'దబాంగ్ 3' చిత్రం మధ్యప్రదేశ్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడి మండులోని ప్రాచీన కోటలో కొన్ని కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్ర బృందం ఇక్కడి పురాతన కట్టడాలకు నష్టం కలిగించడంతో భారత పురావస్తు సర్వే విభాగం(ఎఎస్ఐ) నోటీసులు జారీ చేసింది.
'దబాంగ్ 3' షూటింగ్ కారణంగా మండు కోటలోని జై మహల్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో నిబంధనలకు విరుద్దంగా చిత్ర బృందం ప్రవర్తించడంపై పురావస్తు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారని, ఇలానే కొనసాగితే అనుమతి రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

నిబంధనలను ఉల్లంఘించారు
సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే చిత్ర బృందానికి ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదో వివరిస్తూ 1959 పురావస్తు చట్టంలోని వివరాలు అధికారులు వెల్లడించారు. అయితే వాటిని పట్టించుకోకుండా యూనిట్ సభ్యులు ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

చర్యలు తీసుకుంటామన్న మంత్రి
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి విజయలక్ష్మి మాట్లాడుతూ... తాను స్వయంగా మండు కోటను సందర్శించి అక్కడ జరిగిన డ్యామేజ్ గురించి తెలుసుకుంటానని, అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉంటే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అసలు ఏం జరిగింది?
ఇక్కడ షూటింగ్ జరుగుతుండగా శివలింగం అపహరించారని మొదట ప్రచారం జరిగింది. పవిత్ర శివలింగంపై ఎలాంటి వస్తువులు పడకుండా కర్ర చెక్కలను సిబ్బంది అడ్డంగా ఉంచారు. ఆ తర్వాత వాటిని తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు అని స్థానిక మీడియా కథనాన్ని ప్రసారం చేసింది. చివరకు ఇది ఒక మతానికి సంబంధించిన వివాదం... స్థానికంగా రెండు రాజకీయ పార్టీల గొడవగా మారింది.

దబాంగ్ 3
‘దబాంగ్ 3' మూవీ ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోంది. సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటిస్తుండగా... అర్బాజ్ ఖాన్, మహి గిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











