Salman Khan ఇంట్లోకి సీబీఐ అధికారులు.. అసలేం జరిగిందంటే?
పంజాబ్ గాయకుడు సిద్దూ మూస్వాలా హత్య తర్వాత బాలీవుడ్ సినీ ప్రముఖులకు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఏకంగా సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడంతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ఖాన్ బెదిరింపుల వ్యవహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దాంతో సీబీఐ అధికారులు సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ తండ్రికి బెదిరింపు లేఖ
సిద్దూ మూస్వాలా హత్య తర్వాత మాఫియా శక్తులు సల్మాన్ ఖాన్ను కూడా బెదిరింపులు వచ్చాయనే వార్త బాలీవుడ్లో భయాందోళనలకు గురి చేసింది. అయితే ఆ వార్త ఇంకా మరిచిపోక ముందే సల్మాన్ ఖాన్ తండ్రి సలీంకు ప్రాణాలకు ముప్పు కలిగిస్తామంటూ ఆదివారం బెదిరింపు లేఖ అందింది. ఈ బెదిరింపు వ్యవహారాన్ని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగానే.. వాళ్లు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లేఖ అందజేత
సలీం, సల్మాన్ ఖాన్ బెదిరింపుల వ్యవహారంపై పోలీసుల మీడియాకు వివరాలు అందజేస్తూ.. ఆదివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే సల్మాన్ తండ్రి సలీం మార్నింగ్ వాకింగ్కు వెళ్లారు. వాకింగ్ అనంతరం ఆయన వచ్చి బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద బెంచ్పై కూర్చొని ఉండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆయనకు ఓ లేఖ అందించి వెళ్లిపోయారు. అందులో సల్మాన్, సలీం ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు అని తెలిపారు.

హోంశాఖ అదనపు రక్షణ
సల్మాన్ ఖాన్, సలీం ప్రాణాలకు ముప్పు వాటిల్లిందనే నేపథ్యంలో వారి నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర హోంశాఖ అదనపు రక్షణను వీరిద్దరికి ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఐపీసీ 506 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు సల్మాన్ ఖాన్ ఇంటికి రావడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించడమే కాకుండా హాట్ టాపిక్గా మారింది.

గెలాక్సీ అపార్ట్మెంట్కు సీబీఐ అధికారులు
అయితే సిద్దూ మూస్వాలా హత్య అనంతరం మాఫియా డాన్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు రావడంతో సల్మాన్ ఖాన్ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేయగానే సలీంకు బెదిరింపు లేఖ అందించడం మరింత సంచలనం రేపింది. ముంబైలోని బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్లోని సల్మాన్ ఖాన్ ఇంటిని సీబీఐ అధికారులు సందర్శించారు. వారిని అడిగి విచారణ జరిపారు.

సల్మాన్ ఖాన్ కుటుంబానికి ముప్పు
రాజస్థాన్కు చెందిన మాఫియా నుంచి సల్మాన్ ఖాన్ కుటుంబానికి ముప్పు ఉంది. అందుకే గెలాక్సీ అపార్ట్మెంట్లో సెక్యూరిటీని పెంచాం. రాజస్థాన్ గ్యాంగ్ నుంచి ఎలాంటి అరాచకాలు జరపకుండా కట్టుదిట్టం చేశాం అని మహారాష్ట్ర పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











