హాస్పిటల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.. ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను వెంటనే ముంబైలోని హాస్పిటల్లో తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆమెకు శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో కరోనావైరస్ బారిన పడ్డారేమోననే ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలీవుడ్లో రిషికపూర్, ఇర్ఫాన్, సుశాంత్ లాంటి ఆకస్మిక మరణాలతో విషాదంలో కూరుకుపోయిన నేపథ్యంలో సరోజ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడం మరింత ఆందోళనకు గురి చేసింది. ఆమె ఆరోగ్య పరస్థితి గురించి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం...

కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై
సరోజ్ ఖాన్ కొద్దిరోజులుగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు, చికిత్స కోసం బాంద్రాలోని గురునానక్ హాస్పిటల్కు తరలించాం. నిబంధనల ప్రకారం హాస్పిటల్ వర్గాలు ఆమెకు కోవిడ్19 పరీక్షలు నిర్వహించారు. అయితే నెగిటివ్ రావడంతో ఉపశమనం లభించింది అని కుటుంబ సభ్యలుు తెలిపారు.

కోవిడ్ పరీక్షల అనంతరం
కోవిడ్ 19 పరీక్షల అనంతరం శ్వాస సంబంధిత సమస్యలకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకొంటున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కోవిడ్ లక్షణాలు లేకపోవడం ఉపశమనం కలిగింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాల కాలంలో
భారతీయ సినిమా పరిశ్రమకు సరోజ్ ఖాన్ విశేషమైన సేవలందించారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో ఆమె 2000లకుపైగా పాటలకు నృత్యాలు సమకూర్చారు. తేజాబ్ చిత్రంలోని ఏకో దో తీన్, దేవదాస్ చిత్రంలో డాలా రే డోలా లాంటి పాటలు ఆమె కెరీర్లో మరుపురాని పాటలుగా మిగలడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.
Recommended Video

వృద్దాప్య సంబంధిత సమస్యలతో
71 ఏళ్ల సరోజ్ ఖాన్కు వృద్దాప్యపరమైన, ఆరోగ్య సమస్యల తలెత్తడం కారణంగా ఇటీవల కాలంలో కొరియోగ్రఫికి దూరంగా ఉంటున్నారు. ఆమె గతేడాది కరణ్ జోహర్ రూపొందించిన కళంక్ చిత్రంలో ఆఖరిగా నృత్యాలు సమకూర్చారు. ఆ తర్వాత నుంచి ఆమె పాటలకు నృత్యాలు సమకూర్చిన దాఖలాలు లేవు.


Click it and Unblock the Notifications











