Jawan Piracy: ఆన్లైన్లో జవాన్ ఫుల్ మూవీ.. ఢిల్లీ హైకోర్టు ఊహించని తీర్పు
చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపులను చవి చూసి.. 'పఠాన్' చిత్రంతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఈ ఉత్సాహంతోనే అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్లో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ బాలీవుడ్ బడా హీరో 'జవాన్' అనే సినిమాను చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన 'జవాన్' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కంటిన్యూ అయింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఇలా ఈ చిత్రం రెండు వారాల్లోనే 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ను వసూలు చేసి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.

ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీ థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజులకే పైరసీకి గురైంది. ఈ ఫుల్ మూవీ ఆన్లైన్లో డౌన్లోడ్కు కూడా వచ్చేసింది. ఇది చిత్ర యూనిట్ దృష్టికి కొందరు షారూక్ ఖాన్ అభిమానులు తీసుకు వెళ్లారు. దీంతో నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. అందులో జవాన్ సినిమాకు సంబంధించి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో చట్టవిరుద్ధంగా షేర్ చేయబడిన కంటెంట్ను తొలిగించమని, డీయాక్టివేట్ చేయాలని అభ్యర్థించింది.
'జవాన్' మూవీ పైరసీపై వేసిన పిటీషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. జవాన్ మూవీని పైరసీ చేసిన, దానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం వాట్సాప్, టెలిగ్రామ్ల్లో ఉంటూ జవాన్ సినిమాను పైరసీ కంటెంట్ను షేర్ చేసిన యూజర్ల ఫోన్ నెంబర్స్, వారు ఉపయోగించే అకౌంట్ వివరాలను తెలియజేయాలని ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్, ఐడియా, ఒడాఫోన్, జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ప్రదీప్ నీమాని స్పందిస్తూ.. 'సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న పైరసీపై పోరాటం చేయటానికి మేం పలు యాంటీ పైరసీ ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నాం. అందులో భాగంగా వాట్సాప్, టెలిగ్రామ్స్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో జవాన్ సినిమాకు సంబంధించి పైరసీ కాపీలను అన్వేషిస్తున్నాం. పలువురు వ్యక్తులు ఈ సినిమాకు సంబంధించిన పైరసీ కాపీలను షేర్ చేసినట్లు గుర్తించాం. శాంతా క్రూజ్ పోలీస్ స్టేషన్లో వీరిపై నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది' అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











