Dharmendra net worth: 51 రూపాయలతో కెరీర్.. నేడు వందల కోట్లకు అధిపతి.. ధర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో హీ మ్యాన్గా, మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు ధర్మేంద్ర. దాదాపు 60 ఏళ్ల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించిన ధర్మేంద్ర మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర గురించిన సమాచారం కోసం నెటిజన్లు విస్తృతంగా శోధిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివరాల్లోకి వెళితే..
ధర్మేంద్రకు రెండు పెళ్లిళ్లు
డిసెంబర్ 8, 1935న పంజాబ్లోని నజ్రయిల్లో జన్మించారు ధరేంద్ర. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవాల్ కృష్ణ డియోల్. తల్లిదండ్రులు కేవాల్ క్రిషన్, సత్వంత్ కౌర్. పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధర్మేంద్రకు 1954లో ప్రకాష్ కౌర్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు సన్నీ డియోలు, బాబీ డియోల్ సంతానం. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత హేమామాలినితో ప్రేమలో పడిన ఆయన ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఈశా డియోల్, అహనా వోహ్రా డియోల్ సంతానం.

మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా రికార్డ్
1960లో దిల్ భి తేరా హమ్ భీ తేరే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు ధర్మేంద్ర. ఆ తర్వాత ఆయి మిలన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, అయే దిన్ బాహార్ కే తదితర చిత్రాలతో హిందీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోవడంతో పాటు అభిమానులతో హీ మ్యాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర. 1970, 1980 దశకాలలో హిందీ నాట ధర్మేంద్ర శకం నడిచింది. అమితాబ్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, జితేంద్రలు వరుస హిట్స్తో ఇండస్ట్రీని దున్నేశారు. ఆరు దశాబ్ధాలకు పైగా కెరీర్లో 300కు పైగా సినిమాలలో నటించారు ధర్మేంద్ర. అంతేకాదు తన నటించిన సినిమాలలో 121 సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం. తద్వారా బాలీవుడ్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ హీరోగా ధర్మేంద్ర చరిత్ర సృష్టించారు. 1987లో 9 వరుస హిట్స్తో ఇండస్ట్రీని వణికించారు ధర్మేంద్ర.
రాజకీయాల్లోనూ తన మార్క్
సినిమాలతో పాటు రాజకీయాల్లో దిగిన ధర్మేంద్ర.. భారతీయ జనతా పార్టీలో చేరి 2004 లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఎంపీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్స్కి పరిమితం కావడం, ఎక్కువగా ఫామ్హౌస్లోనే ఉండటంతో ధర్మేంద్రపై విమర్శలు వచ్చాయి. భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గాను 2012లో పద్మ భూషణ్ పురస్కారంతో ధర్మేంద్రను సత్కరించింది భారత ప్రభుత్వం. తన నట వారసులుగా సన్నీడియోల్, బాబీ డియోల్లను చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు ధర్మేంద్ర. వారిద్దరూ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్స్గా ఎదిగారు.
ధర్మేంద్ర ఆస్తులు, సంపద
కెరీర్లో తన తొలి సినిమాకు 51 రూపాయలను పారితోషికంగా తీసుకున్న ధర్మేంద్ర.. 60 ఏళ్ల కెరీర్లో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగానూ మారారు. విజేత ఫిల్మ్స్ బ్యానర్పై ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. డియోల్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయల పైమాటేనని బాలీవుడ్ టాక్. ఇందులో ధర్మేంద్ర ఒక్కడిదే 450 కోట్లు ఉంటుందని అంచనా. ఇక సన్నీడియోల్ (130 కోట్ల రూపాయలు), బాబీ డియోల్ (60 కోట్ల రూపాయలు), అభయ్ డియోల్ (400 కోట్ల రూపాయలు), కరణ్ డియోల్ (50 కోట్ల రూపాయలు). ధర్మేంద్ర హాస్పిటాలిటీ, హోటల్స్ బిజినెస్లోకి ప్రవేశించి గరమ్ ధరమ్ దాబా, హీ మాన్ బ్రాండ్స్తో రెస్టారెంట్స్ స్థాపించారు ధర్మేంద్ర.
ధర్మేంద్రకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన లోనావాలాలో 100 ఎకరాల ఫామ్హౌస్ ఉంది. ఇందులో అత్యాధునిక వసతులు ఉన్నాయని బాలీవుడ్ టాక్. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ధర్మేంద్రకు కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నాయి. ఇక ఆయన గ్యారేజీలో వింటేజ్ ఫియట్, రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్ ఎస్ఎల్ 500 మోడల్ కార్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











