‘ప్రైమ్ మినిస్టర్’ను కించపరిచారంటూ.. ఇద్దరు ప్రముఖ నటులపై కేసు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసు నమోదైంది. మన్మోహన్ సింగ్ పాత్రను పోషించిన అనుపమ్ ఖేర్, ఆయన మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు పాత్రలో నటించిన అక్షయ్ ఖాన్నాతోపాటు ఈ సినిమాతో సంబంధమున్న సాంకేతిక నిపుణులపై ముజఫర్పూర్ పరిధిలోని కంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనవరి 8న జారీ చేసిన ఆదేశాలను తుంగలో తొక్కారనే విషయాన్ని తాజా ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

ప్రధానమంత్రిని కించపరిచే విధంగా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కించపరిచే విధంగా సినిమాను రూపొందించారనే ఆరోపణలతో అడ్వకేటు సుధీర్ కుమార్ ఓజా జనవరి 8వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ కేసుతో సంబంధమున్న 12 మందికి నోటీసులు జారీ చేసింది. అయితే వాటికి స్పందించకపోవడంతో ఈ కేసును కోర్టు తీవ్రంగా పరిగణించింది.

12 మంది ప్రముఖులపై కేసు
కోర్టు ఆదేశాలకు స్పందించకపోవడంతో ముజఫర్పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ద్వారా కంటి పోలీసు స్టేషన్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో మంగళవారం మరోసారి కంటి పోలీస్ స్టేషన్లో మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అని అడ్వకేట్ ఓజా మీడియాకు వెల్లడించారు.

కుట్రపూరితమైన కేసుగా.. సెక్షన్లు ఇవే
కుట్ర పూరితమైన ఉద్దేశం, శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే విధంగా, కొన్ని వర్గాలను రెచ్చగొట్టే ఉద్దేశం, తదితర అంశాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 295, 153, 153A, 293, 504, 506, 120B, 34 ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలైంది అని ఓజా పేర్కొన్నారు. అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా పేర్లను దాఖలు చేశారు.

దర్శకుడు, నిర్మాతలకు షాక్
ఇంకా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అటల్ బీహారి వాజ్పేయ్, ఎల్కే అద్వానీ, లాలూ ప్రసాద్ పాత్రలను పోషించిన నటీనటులు పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అంతేకాకుండా దర్శకుడు, నిర్మాత, ఇతర చిత్ర యూనిట్ సభ్యులను కూడా కేసులో భాగం చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











